టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లపై వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరి వల్లే టీమిండియా వరుస విజయాలు సాధిస్తుందని చెప్పాడు. టీమిండియా అద్భుత ప్రదర్శన క్రెడిట్ సూర్య, గంభీర్ భాయ్లేదనని స్పష్టం చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఒమన్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ గెలుపుతో టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. మూడింటికి మూడు మ్యాచ్లు గెలిచి సగర్వంగా సూపర్-4లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నిజాయితీగా చెప్పాలంటే మిడిలార్డర్లో కొంత సమయం గడిపే అవకాశం దక్కడం నా అదృష్టం. సొంతగడ్డపై నేను కొన్ని మంచి ప్రదర్శనలు చేసాను. కానీ దేశం తరఫున ఆసియా కప్లో ఆడుతున్నప్పుడు మిడిల్లో గేమ్ టైమ్ దొరకడం కలిసొచ్చింది. నిజం చెప్పాలంటే పవర్ ప్లేలో ఒమన్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మా కంటే మెరుగ్గా పరిస్థితులను అంచనా వేసింది. దాంతో మేం కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చింది. పరిస్థితులతో పాటు ప్రత్యర్థిని గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభిషేక్తో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదించాను. అతనితో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. బ్యాటింగ్ చాలా ఈజీగా అనిపిస్తోంది. ఒమన్తో మ్యాచ్లో మా చిన్న భాగస్వామ్యాన్ని మేం ఆస్వాదించాం.
సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ భాయ్లకు చాలా క్రెడిట్ ఇవ్వాలి. వారు డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఉంచుతున్నారు. ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తున్నారు. జట్టులో ప్రతీ ఒక్కరికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ప్రతీ ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. అది జట్టు విజయాలకు కారణమవుతోంది. టీ20 ఫార్మాట్ను నేను బాగా ఆస్వాదిస్తున్నాను. మాకు మంచి ట్రైనర్లతో పాటు ఫిజియోలు ఉన్నారు. వాళ్లు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. దాంతో మేం మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటున్నా.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.