టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన ఐదో టీ20లో సంజూ శాంసన్ ఇండెక్స్ ఫింగర్ విరిగినట్లు సమాచారం. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ సంజూ గ్లోవ్స్కు బలంగా తాకడంతో చూపుడు వేలు విరిగినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, నెల రోజుల పాటు అతను ఆటకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
ఈ గాయం కారణంగా అప్కమింగ్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్కు సంజూ శాంసన్ దూరం కానున్నాడు. ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంజూ శాంసన్.. తన స్వస్థలం తిరవనంతపురం వెళ్లాడు. త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి రిహాబిలిటేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సంజూ మళ్లీ ఆటను మొదలు పెట్టనున్నాడు.

'సంజూ శాంసన్ కుడి చేతి చూపుడు వేలు విరిగింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి ఐదు నుంచి 6 వారాల సమయం పట్టనుంది. కాబట్టి అతను రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశాలు లేవు. జమ్మూ కశ్మీర్, కేరళ మధ్య ఫిబ్రవరి 8-12 మధ్య పుణె వేదికగా జరగనుంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే ఛాన్స్ ఉంది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.
ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్ల్లోనూ పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఆఖరి టీ20లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో బంతినే సంజూ శాంసన్ గ్లోవ్స్కి బలంగా తాకింది. అయితే సంజూ శాంసన్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సంజూ శాంసన్ సైతం స్పందించలేదు.
రాజస్థాన్ రాయల్స్ సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ దూరమవ్వడం ఆ జట్టుకు తీరని లోటే. మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఆ సమయంలోపు అతను కోలుకుంటాడని సంజూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.