వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన టీమిండియాలో సభ్యుడైన సంజూ శాంసన్.. ప్రస్తుతం స్వరాష్టమైన కేరళలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం జింబాబ్వే, శ్రీలంకతో టీ20 సిరీస్లు ఆడిన సంజూ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. తాజాగా కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంజూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. వన్డేల్లో చోటు దక్కకపోవడంపై ఓ మీడియా ప్రతినిధి అడిన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు.

'జట్టుకు ఎంపిక చేసినప్పుడు వెళ్లి ఆడటమే నా పని. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే చాలు. మన జట్టు లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో శతకం సాధించిన సంజూ శాంసన్కు ఆ తర్వాత మళ్లీ అవకాశం దక్కలేదు. టీ20 ప్రపంచకప్కు ఎంపికైనా బెంచ్కే పరిమితమయ్యాడు. శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు.