టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడడని అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ అన్నారు. కొంతమంది తమ స్వార్థం కోసం, జట్టులో చోటు నిలబెట్టుకునేందుకు ఆడుతారని, తన కొడుకు మాత్రం అలా కాదని తెలిపారు. ఇటీవల టీ20 క్రికెట్లో సంజూ శాంసన్ వరుస సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలి అంతర్జాతీయ శతకం సాధించిన సంజూ శాంసన్.. సౌతాఫ్రికా పర్యటనలోనూ అదే జోరు కొనసాగించాడు. తొలి టీ20లో విధ్వంసకర శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ రెండో టీ20లో డకౌట్గా వెనుదిరిగి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

ఆ నలుగురు నాశనం చేశారు..
సంజూ శాంసన్ బ్యాటింగ్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతని తండ్రి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేశారని ఆరోపించారు. తన కుమారుడి నైపుణ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చిన గంభీర్, సూర్యకుమార్ యాదవ్లకు శాంసన్ విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపాడు.
'సరైన అవకాశాలు ఇవ్వకుండా ముగ్గురు-నలుగురు వ్యక్తులు నా కొడుకు 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేశారు. ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కెప్టెన్లతో పాటు రాహుల్ ద్రవిడ్ వంటి కోచ్లు సంజూ శాంసన్కు తగిన అవకాశాలు ఇవ్వలేదు. ఈ నలుగురు సంజూ 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేయడంతో పాటు తీవ్రంగా బాధపెట్టారు. వారి వల్ల సంజూ శాంసన్ మరింత రాటుదేలాడు.
క్రిష్ శ్రీకాంత్ ఓవర్గా మాట్లాడాడు..
తమిళనాడు మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ సంజూ పట్ల దారుణంగా మాట్లాడాడు. అతను ఏం ఆడాడో నాకు తెలియదు. కానీ అతను సంజూ గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడటం లేదు. తన మాటలతో సంజూను తీవ్రంగా బాధపెట్టాడు. సంజూ శాంసన్ బంగ్లాదేశ్పై సెంచరీ చేయడాన్ని ఎగతాళి చేశాడు.
ఏ జట్టు మీద చేసిన సెంచరీ సెంచరీనే. సచిన్, ద్రవిడ్లా సంజూకు మంచి క్లాసికల్ టచ్ ఉంది. ప్రోత్సహించకున్నా సరే కానీ కనీస మర్యాద ఇవ్వకుంటే ఎలా? సంజూ శాంసన్కు వరుసగా అవకాశాలు రావడంతో సంతోషంగా ఉన్నాను.
గంభీర్, సూర్యకు థ్యాంక్స్..
గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్కు నా కృతజ్ఞతలు. ఈ ఇద్దరూ టీ20 జట్టులో లేకుంటే సంజూ శాంసన్ను మళ్లీ పక్కనపెట్టేవారు. నా కొడుకు సాధించిన శతకాన్ని ఈ ఇద్దరికీ అంకితమివ్వాలనుకుంటున్నాను. సంజూ వరుస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి.
ఇన్నేళ్లు తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడుతారు. కానీ సంజూ శాంసన్ ఎప్పుడూ అలా ఆడాడు.'అని శాంసన్ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.