తాను జట్టు కోసమే ఆడితే సెంచరీ రివార్డ్గా లభించిందని చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే తనకు ముఖ్యమని మరోసారి స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది.
సంజూ శాంసన్(54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 నాటౌట్) అజేయ శతకంతో సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన సంజూ శాంసన్.. వరుసగా వికెట్లు కోల్పోవడంతో చివరి వరకు బాధ్యతగా ఆడాలనుకున్నాని తెలిపాడు.
'వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్పై సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను కేవలం పరిస్థితులను గమనిస్తూ ఆడాను. ఆరంభంలో బంతి స్వింగ్ అవుతూ, కాస్త ఆగుతూ వచ్చింది. పవర్ప్లే తర్వాత మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. దాంతో క్రీజులో సెట్ అయిన నేను చివరకు ఆడాలని నిర్ణయించుకున్నా.

మనం ఏం చేయాలో ఆటనే మనకు చెబుతుంది. ముందుగానే ఊహించుకుని ఆడాల్సిన అవసరం లేదు . నాకు జట్టు గెలుపే తొలి ప్రాధాన్యత. నాకున్న అనుభవంతో ఆటను అర్థం చేసుకున్నాను. మాది యువ జట్టు.. కానీ వరుసగా మూడు ఓటముల తర్వాత మేం చూపించిన పోరాటం అద్భుతం. మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం అన్ని మ్యాచ్లకు సిద్ధంగా ఉండి ఆటను ఆస్వాదించాలి. వాంఖడేలో ఇంతలా పసుపు జెర్సీలు కనిపిస్తుండటం నాకు చాలా కొత్తగా ఉంది.'అని సంజూ శాంసన్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 నాటౌట్) ఒక్కడే అజేయ శతకంతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్(2/37), అల్లా ఘజన్ఫర్(2/25) రెండేసి వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు
అనంతరం ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 5 ఫోర్లుతో 35), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లతో 37) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. డానిష్ మలెవర్(0), నమన్ ధీర్(0), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్(0) డకౌట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అకీల్ హోసెన్(4/17) నాలుగు వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. నూర్ అహ్మద్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ చౌదరీ, అన్షుల్ కంబోజ్, జెమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ తలో వికెట్ తీసారు.