హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వ్యూహాల కారణంగానే ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో బుధవారం జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సంజూ శాంసన్ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు హెడ్, బౌలింగ్ కోచ్ పకడ్బందీ వ్యూహాలతోనే విజయం సాధించినట్లు తెలిపాడు. ఈ గెలుపు క్రెడిట్ సంగక్కర, షేన్ బాండ్కు ఇచ్చాడు.

'క్రికెట్, జీవితం ఒకే తరహా గుణపాఠాలు నేర్పుతాయి. ఈ సీజన్ మేం మంచి, చెడు రెండు దశలు చూశాం. అయితే మేం పుంజుకోవాలని భావించాం. ఈ రోజు మా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదే.
మా బౌలర్లు ఎప్పుడూ ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ ఫీల్డ్ సెటప్ పెట్టుకొని బౌలింగ్ చేస్తారు. ఈ క్రెడిట్ మాత్రం హెడ్ కోచ్ సంగక్కరతో పాటు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్కు ఇవ్వాలి. హోటల్ రూమ్స్లో గంటలకొద్ది చర్చిస్తూ వ్యూహాలు రచించేది ఈ ఇద్దరే. అశ్విన్, బౌల్ట్ తమ అనుభవాన్ని చూపెట్టారు.
22 ఏళ్ల వయసులోనే రియాన్ పరాగ్, జైస్వాల్, జురెల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. నేను 100 శాతం ఆరోగ్యంగా లేను. డ్రెస్సింగ్ రూమ్లోకి ఏదో వైరస్ ఎంట్రీ ఇచ్చింది. చాలా మంది దగ్గుతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రోవ్మన్ అద్భుతంగా మ్యాచ్ను ముగించాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం సిద్దంగా ఉన్నాం.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(30 బంతుల్లో 8 ఫోర్లతో 45), రియాన్ పరాగ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 36), షిమ్రాన్ హెట్మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26) సత్తా చాటారు. చివర్లో రోవ్మన్ పోవెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్.. చెన్నై వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది.