టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు నమోదు చేసిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన చివరి టీ20లో సెంచరీ చేయడం ద్వారా సంజూ శాంసన్ ఈ ఫీట్ సాధించాడు. ఈ సిరీస్లో సంజూకు ఇది రెండో శతకం కావడం విశేషం.
గతనెలలోనే హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన టీ20లో తొలి సెంచరీ నమోదు చేసిన సంజూ శాంసన్.. సౌతాఫ్రికాతో ఫస్ట్ మ్యాచ్లో మరో శతకం నమోదు చేసి వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి భారత బ్యాటర్గా రికార్డ్ సాధించాడు. తాజా శతకంతో వికెట్ కీపర్గా ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేశాడు.

ఈ క్రమంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ను సంజూ శాంసన్ అధిగమించాడు. ఫిల్ సాల్ట్ అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 2 శతకాలు నమోదు చేశాడు. వికెట్ల కీపర్లలో సంజూ, సాల్ట్ మాత్రమే అంతర్జాతీయ టీ20ల్లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు నమోదు చేశారు.
టీ20ల్లో భారత తరఫున అత్యధిక సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాటర్గానూ సంజూ శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్లు సంజూ శాంసన్ కంటే ముందున్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్లో మూడు టీ20 శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్గా సంజూ శాంసన్ నిలిచాడు.
అంతర్జాతీయ టీ20ల్లో సంజూ శాంసన్కు ఇది నాలుగో 50 ప్లస్ స్కోర్. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి భారత వికెట్ కీపర్గానూ సంజూ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్(3), ఇషాన్ కిషన్(3), మహేంద్ర సింగ్ ధోనీ(2), రిషభ్ పంత్లను సంజూ వెనక్కినెట్టాడు.
తిలక్ వర్మతో కలిసి సంజూ శాంసన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే మ్యాచ్లో టెస్ట్ హోదా కలిగిన టీమ్ తరఫున ఇద్దరూ బ్యాటర్లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి. తిలక్ వర్మతో కలిసి సంజూ శాంసన్ రెండో వికెట్కు అజేయంగా 210 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని అందించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లతో 109 నాటౌట్), తిలక్ వర్మ(47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్లతో 120 నాటౌట్) అజేయ శతకాలతో రాణించారు. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36) దూకుడుగా ఆడాడు.