ఫ్లోరిడా: టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మరో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వెస్టిండీస్తో చివరి టీ20లోనూ ఈ కేరళ బ్యాటర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులే చేసి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడని ట్రోల్ చేస్తున్నారు.
వెస్టిండీస్తో వన్డే సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన సంజూ శాంసన్ తొలి మ్యాచ్లో 9 పరుగులతో విఫలమైన రెండో మ్యాచ్లో 51 హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఐదు టీ20ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో 12, 7 పరుగులతో దారుణంగా విఫలమైన సంజూకు మూడు, నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. చివరి టీ20లో బ్యాటింగ్ చేసే చాన్స్ వచ్చినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పటిలానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్పై ఆశలు వదులుకోవాలని సంజూ శాంసన్కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు. సంజూ శాంసన్కు ఐపీఎలే గతని, క్యాష్ రిచ్ లీగ్ ఆడుకుంటూనే కెరీర్ ముగించాలని ఎగతాళి చేస్తున్నారు.
యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ వంటి కుర్రాళ్లు దుమ్మురేపుతుంటే ఎంతో అనుభవం కలిగిన సంజూ విఫలమవడం తమకు అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతనికి అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే యోగం లేదని, దరిద్రానికే బ్రాండ్ అంబాసిడరని ట్రోల్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(5), శుభ్మన్ గిల్(9) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
కానీ రోస్టన్ చేజ్ తిలక్ వర్మ(27)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. ఆ వెంటనే సంజూ శాంసన్ కూడా ఔటవ్వడంతో టీమిండియా 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్తో పాటు హార్దిక్ పాండ్యా ఉన్నారు.