టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీలాంటి నాయకుడిని తాను ఇప్పటి వరకు చూడలేదని కొనియాడాడు. తన మనవడితో మాట్లాడటాన్ని కూడా ధోనీ ఆస్వాదించాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2016, 2017 సీజన్లలో ధోనీకి దగ్గర సంజీవ్ గోయెంకా పనిచేశాడు.
ఈ రెండేళ్ల పాటు సీఎస్కే నిషేధానికి గురవ్వగా.. ధోనీ రైజింగ్ పుణె సూపర్జెయింట్స్కు సారథ్యం వహించాడు. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో ధోనీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు.

ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ధోనీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మతీష పతీరణ వంటి యంగ్ బౌలర్ను ధోనీ మ్యాచ్ విన్నర్గా మార్చడని కొనియాడాడు.
'ధోనీలాంటి నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ధోనీ ఆలోచనలు, క్రికెట్ పట్ల అతనికి ఉన్న ఆలోచన విధానం, ఈ వయస్సులో కూడా తనను తాను పునరుద్దరించుకున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది. మతీష పతీరణ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ధోనీ అతన్ని మ్యాచ్ విన్నర్గా తీర్చిదిద్దాడు.
ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడిని ఉపయోగించాలో ధోనీకి బాగా తెలుసు. నేను ధోనీతో మాట్లాడిన ప్రతీసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. మా మనవడితో కూడా ధోనీ మాట్లాడాడు. మా మనవడు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం నా మనవడికి 11 ఏళ్లు. గత సీజన్లో చెన్నై, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మా మనవడు ధోనీని తన ప్రశ్నలతో విసిగించాడు.
దాంతో ధోనీని వదిలేయాలని మా మనవడికి చెప్పాను. కానీ ధోనీ మాత్రం అతనితో సంభాషణను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. ఇది చూసి ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాను. ధోనీ ఎక్కడ ఆడినా స్టేడియాలు మొత్తం పసుపు జెర్సీలతో నిండిపోతాయి.'అని సంజీవ్ గోయెంకా చెప్పుకొచ్చాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడినప్పుడు ధోనీనీ అవమానించిన గోయెంకా ఇప్పుడు ప్రశంసించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.