
టీమ్ సెలెక్షన్ బాలేదు..
'సౌతాఫ్రికా పర్యటనకు సంబంధించి.. భారత జట్టు ఎంపికలోనే పెద్ద లోపముంది. చాలా మంది అనుభవం, ఫామ్లో లేని ఆటగాళ్లను తీసుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్లో సత్తా చాటగలిగే నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ చేయడం చాలా సులభం. ఓపెనర్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలు నమోదు చేసినా.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లపైనే జట్టు విజయం ఆధారపడి ఉంటుంది. సౌతాఫ్రికా పర్యటనలో అదే లోపించింది. మెరుగైన ఆరంభాలు లభించినా.. స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమిపాలైంది' అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

దీపక్ చాహర్ను తీసుకోవాలి..
'టీమిండియా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేయాల్సి ఉంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మునుపటి లయను అందుకోవడం దాదాపు కష్టమే అనిపిస్తోంది. అతని స్థానంలో దీపక్ చాహర్ను పూర్తి స్థాయి ఆటగాడిగా జట్టులోకి తీసుకోవచ్చు. మూడో వన్డేలో జన్నెమన్ మలన్ని ఔట్ చేసేందుకు దీపక్ వేసిన ఆ ఒక్క బంతి చాలు.. అతను ఎంత నాణ్యమైన బౌలరో చెప్పేందుకు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆ ఒక్క మ్యాచ్లోనే రెండు వికెట్లు సహా 54 పరుగులు చేశాడు' అని మంజ్రేకర్ గుర్తు చేశాడు.

అశ్విన్ అవసరమా..?
'సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో కూడా భారత్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంది. చాలా ఏళ్ల తర్వాత అనివార్య కారణాలతో అతనికి తుది జట్టులో స్థానం దక్కింది. రెండు మ్యాచులు ఆడినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. యువ ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణకు మరిన్ని అవకాశాలు కల్పించాలి. వన్డే ఫార్మాట్లో అశ్విన్ స్థానంలో మహమ్మద్ షమీని ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు' అని మంజ్రేకర్ సూచించాడు.


Click it and Unblock the Notifications
