
అంతా నాన్సెన్స్..
ఐదు టీ20ల సిరీస్లో టీమ్ కాంబినేషన్ను పదే పదే మార్చడం, వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్ను జట్టులో కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటిపై తాజాగా స్పందించిన విరాట్ కోహ్లీ బయట జరిగే చర్చంతా నాన్సెన్స్ అని కొట్టిపారేశాడు. 'నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు కూడా బయట జరిగే చర్చంతా నా దృష్టిలో అర్థరహితం.
ఎవరో ఒకరు ఓ ఆటగాడి గురించి మాట్లాడుతుంటారు. అసలు వారి ఉద్దేశం, ఆలోచన ఏంటో ఎవరికీ తెలియదు. అలాంటి వాటిని పట్టించుకోకపోవడం ఉత్తమం. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆటగాడితో ఎలా వ్యవహరించాలో టీమ్మేనేజ్మెంట్కు తెలుసు. వారు మానసికంగా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మేం ఆ పని కొనసాగిస్తున్నాం. బయట విమర్శలను ఏ మాత్రం పట్టించుకోం' అని విరాట్ స్పష్టం చేశాడు.
ధోనీని చూసి నేర్చుకో..
ఇక విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై మంజ్రేకర్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. 'బయట జరిగే చర్చంతా విరాట్ అర్థరహితమని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. కానీ అది ఆట పట్ల ప్రజలు స్పందిస్తున్న తీరని అతను తెలుసుకోవాలి. బాగా ఆడినప్పుడు ప్రశంసించనవారే.. తప్పులు చేసినప్పుడు విమర్శిస్తారు. ఓ కెప్టెన్గా విరాట్ ఈ విషయాన్ని గ్రహించి ప్రశాంతంగా, పరిపక్వతతో ఉండటం నేర్చుకోవాలి. ముఖ్యంగా ధోనీ ఎలా ఉండేవాడో తెలుసుకోవాలి'అని మంజ్రేకర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.

సూర్యకోసమే..
సూర్యకుమార్ వంటి యువకులకు అవకాశమిచ్చేందుకే ఆఖరి టీ20లో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేశానని స్పష్టం చేశాడు. జట్టు మేళవింపునకు అవసరమైతే ఎలాంటి పాత్రనైనా స్వీకరిస్తానని వెల్లడించాడు. 'మైదానంలో దిగే జట్టు కూర్పులో సెలక్టర్లకు ఎలాంటి పాత్ర లేదు. ఇక రోహిత్ చెప్పినట్టుగా ఇదొక వ్యూహం మాత్రమే. నిజమే, మేమిద్దరం కలిసి ఓపెనింగ్ చేయడాన్ని ఆస్వాదించాం. మా బ్యాటింగ్ జట్టుపై సానుకూల ప్రభావం చూపించింది. అయితే భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు. అయితే ఓపెనర్గా రావడం వల్ల సూర్యకు చోటిచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. అతనిలాగే బ్యాటింగ్ కొనసాగిస్తే జట్టు అవసరాల మేరకు ఏ పాత్ర పోషించేందుకైనా నేను సిద్ధమే. ప్రపంచకప్ సమీపించే నాటికి దీనిపై మరింత చర్చిస్తాం' అని విరాట్ పేర్కొన్నాడు.

ధావనే ఓపెనర్..
తొలి వన్డేలో రోహిత్తో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేస్తాడని కోహ్లీ స్పష్టం చేశాడు. వన్డేల్లో రోహిత్-ధావన్ ఓపెనింగ్ భాగస్వామ్యంపై తమకెలాంటి సందేహాలు లేవని పేర్కొన్నాడు. కొన్నేళ్లుగా వారు జట్టుకు శుభారంభాలు అందించారని వెల్లడించాడు. ఈ ఏడాది టీ20 ప్రపంపచకప్ ఉండటం, పనిభారం దృష్ట్యా షెడ్యూళ్లను ఆటగాళ్లను సంప్రదించాక చేస్తే బాగుంటుందని అన్నాడు. 'గతంలో ఎన్నోసార్లు చెప్పాను. పనిభారంపై సమీక్ష అవసరం. ప్రస్తుతం మేం ఆంక్షల మధ్య ఉంటున్నాం. మున్ముందూ బుడగల్లోనే ఉండాల్సి రావొచ్చు. అందుకే శారీరకంగానే కాకుండా మానసికంగానూ తాజాగా ఉండటం అవసరం. ఈ విషయంపై ఆటగాళ్లతో మాట్లాడాలి. ఈ సంక్లిష్టమైన రోజుల్లో ఆడేవాళ్లు ఆడగలుగుతారు. ఇబ్బందిగా ఉంటే వారు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇస్తారు' అని కోహ్లీ తెలిపాడు.


Click it and Unblock the Notifications
