టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్లో రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగడాన్ని తప్పుబట్టాడు. తన స్వార్థం కోసం ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ను డిస్టర్బ్ చేశాడని మండిపడ్డాడు.
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 5 బంతుల్లో 3 పరుగులే చేసి చెత్త షాట్తో వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్(42 బంతుల్లో 3 ఫోర్లతో 24) సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. కానీ కమిన్స్ వేసిన స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఓపెనర్గా బరిలోకి దిగి విఫలమైన రోహిత్ శర్మపై సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'ఆస్ట్రేలియాపై గడ్డపై అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు ఎప్పుడైనా ఎక్కువ మర్యాద దక్కుతుంది. ఈ సిరీస్లో టీమిండియా బెస్ట్ బ్యాటర్ కేఎల్ రాహుల్. టాపార్డర్లో అతను నిలకడగా పరుగులు చేశాడు. రికార్డ్ భాగస్వామ్యాన్ని అందించాడు. కానీ రోహిత్ శర్మను ఫామ్లోకి తీసుకొచ్చేందుకు రాహుల్ను టీమిండియా మేనేజ్మెంట్ ఓపెనర్గా తప్పించింది. నా దృష్టిలో ఇది ఘోర తప్పిదం.
మీడియా సమావేశంలో రోహిత్.. అద్భుతంగా ఆడుతున్న యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీని విడదీయనని చెప్పాడు. కానీ ఈ మ్యాచ్లో ఆ జోడీని విడదీసి రాహుల్ను డిస్టర్బ్ చేశాడు. ఇలా తన స్వార్థం కోసం రాహుల్ను ఇబ్బంది పెట్టడం సరికాదు'అని సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు.
ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 82) శతకం చేజార్చుకోగా.. విరాట్ కోహ్లీ(86 బంతుల్లో 4 ఫోర్లతో 36) మరోసారి నిరాశపరిచాడు. క్రీజులో రిషభ్ పంత్(6 బ్యాటింగ్)తో పాటు రవీంద్ర జడేజా(4) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీసారు.
అంతకుముందు 311/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 140) భారీ శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు.