టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను 8వ స్థానంలో బ్యాటింగ్కు పంపడాన్ని తప్పుబట్టాడు. అత్యంత చెత్త నిర్ణయమంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించాడు.
న్యూజిలాండ్తో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఆజాజ్ పటేల్ బౌలింగ్లో ఐదు బంతులాడి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. సాధారణంగా సర్ఫరాజ్ ఖాన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.

అయితే ముంబై టెస్ట్ తొలి రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్ను నైట్వాచ్మన్గా పంపించడంతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు జరిగింది. ఇక ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగాల్సిన సర్ఫరాజ్ ఖాన్ను 8వ స్థానంలో పంపించారు. అతని కంటే ముందు లెఫ్టాండర్ అయిన రవీంద్ర జడేజాను బ్యాటింగ్కు పంపగా అతను తీవ్రంగా నిరాశపరిచాడు.
క్రీజులో రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన శుభ్మన్ గిల్ సెట్ అవ్వడంతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన జడేజాను పంపించారు. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఈ క్రమంలోనే టీమిండియా మేనేజ్మెంట్పై సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సూపర్ ఫామ్లో ఉండటంతో పాటు స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడే బ్యాటర్ను 8వ స్థానంలో బ్యాటింగ్ పంపిస్తారా? అని ఎక్స్వేదికగా ప్రశ్నించాడు.
'తొలి మూడు టెస్ట్ల్లో మూడు హాఫ్ సెంచరీలు.. బెంగళూరు టెస్ట్లో 150 పరుగులు, స్పిన్ను సమర్థవంతంగా ఆడగలడు. అలాంటి బ్యాటర్ను లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం లోయరార్డర్లో బ్యాటింగ్ పంపిస్తారా? అసలు బుద్దుందా? సర్ఫరాజ్ ఖాన్ 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. టీమిండియా మేనేజ్మెంట్ నుంచి అత్యంత చెత్త నిర్ణయం'అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో సర్ఫరాజ్ ఖాన్(150) భారీ శతకంతో రాణించాడు. కానీ పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్లో దారుణంగా విఫలమయ్యాడు. తాజా మ్యాచ్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్పై టీమిండియా పట్టుబిగించింది. 28 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ను రెండో రోజు ఆట ముగిసే సమయానికి 171/9కు కట్టడి చేసింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు 86/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(146 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 90) తృటిలో శతకం చేజార్చుకోగా.. రిషభ్ పంత్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.