న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కథ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారీ అంచనాలతో ఈ సీజన్ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 16 మ్యాచ్లాడి 115.59 స్ట్రైక్రేట్తో 341 పరుగులే చేశాడు. ఇందులో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ వైఫల్యానికి ప్రధాన కారణం అతను ఫ్రంట్ ఫుట్పై ఆడేందుకు ప్రయత్నించడమేనని భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ కోహ్లీ బ్యాటింగ్ తీరును విశ్లేషించిన సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫుట్పై ఆడేందుకు ఇష్టపడతాడు. కానీ అలా ఆడటం అతనికి కలిసి రావడం లేదు. మానసిక దృఢత్వం కచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. కానీ.. టెక్నికల్ లోపాల్ని పూర్తిగా కప్పిపుచ్చుకోలేం. షార్ట్ పిచ్ బాల్.. అది కూడా బౌన్స్ అవుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫుట్పై ఆడి మూల్యం చెల్లించుకున్నాడు.'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుతంగా ఆడిందని చెప్పిన సంజయ్ మంజ్రేకర్.. ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ విరాట్ కోహ్లీ కంటే బాగుందని కితాబిచ్చాడు. రాజస్థాన్ రాయల్స్తో క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఓ సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించిన విరాట్ కోహ్లీ.. రెండో ఓవర్లోనే వికెట్ చేజార్చుకున్నాడు. ప్రసిద్ కృష్ణ ఆఫ్ స్టంప్కి వెలుపలగా విసిరిన బంతిని వెంటాడిన కోహ్లీ.. వికెట్ కీపర్ సంజు శాంసన్కి సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తంగా.. ఐపీఎల్ 2022 సీజన్లో మూడు సార్లు గోల్డెన్ డక్గా వెనుదిరిగిన కోహ్లీ.. ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌ ట్; 10 ఫోర్లు, 6 సిక్స్ లు) సీజన్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. రేపు ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ తలపడుతుంది.