
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తాడని వివాదాస్పద కామెంటేర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించిన మంజ్రేకర్.. వన్డే ఫార్మాట్ అతని బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతుందన్నాడు. ఓ చానెల్తో మాట్లాడుతూ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వన్డే ఫార్మాట్లో కోహ్లీ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తక్కువని..దాంతో అతను ఫామ్తో పాటు నిలకడను కూడా అందుకొంటాడని జోస్యం చెప్పాడు.
'ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఫామ్లోకి రావాలనుకునే ఆటగాళ్లకు ఈ వన్డే ఫార్మాట్ అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఈ ఫార్మాట్లో ఆడటం రోహిత్ శర్మకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అతను ఇప్పటికే వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడు. ఈ ఫార్మాట్లో దాదాపు 65శాతం పరుగులు సింగిల్స్, డబుల్స్తోనే లభిస్తాయి. ఈ రకంగా పరుగులు తీయడానికి కోహ్లీ ఇష్టపడతాడు. ఇది అతడిపై ఒత్తిడి తగ్గిస్తుంది. అయితే ఇన్నాళ్లు కోహ్లీ ఫామ్ కోల్పోయాడని చెప్పడం సరికాదు. అతను జట్టుకు అవసరమైన మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. కాకపోతే సెంచరీ చేయలేకపోయాడంతే.' అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ 2022లో సెంచరీ నిరీక్షణకు తెరదించిన విరాట్.. ఆ క్షణం నుంచి చెలరేగుతున్నాడు. టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన విరాట్.. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డేల్లోనూ సెంచరీ సాధించాడు. డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన చివరి వన్డేలో శతకం సాధించాడు. కేవలం 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అదే మ్యాచ్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. అదే జోరును ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు.
శ్రీలంకతో తొలి వన్డేలో శతక్కొట్టిన కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 113).. ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. వన్డే ఫార్మాట్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన విరాట్.. 45వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 73వ అంతర్జాతీయ సెంచరీ సాధించి సచిన్ 100 సెంచరీల రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు.