ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా వ్యూహాలు ఏంటో అతనికి తెలుసని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. వాటికి తగ్గట్లుగానే కోహ్లీ సిద్దమవుతాడని చెప్పాడు.
ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఇరు జట్ల మాజీ క్రికెటర్ల తమ మాటలతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ మంజ్రేకర్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఆస్ట్రేలియా వాళ్లు తన కోసం ఏ వ్యూహాలు రచిస్తారో విరాట్ కోహ్లీకి తెలుసు. ఆస్ట్రేలియా బౌలర్లు కచ్చితంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్తో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మూడ్ను టెస్ట్ చేస్తారు. సాధారణంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను కోహ్లీ వదిలేస్తాడు. ఒకవేళ బంతి సరైన ప్రదేశంలో పిచ్ అయితే మాత్రం డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
ఇటీవల విరాట్ కోహ్లీని కట్టడి చేసేందుకు బౌలర్లు బౌన్సర్లను అస్త్రంగా వాడుతున్నాడు. అతని శరీరాన్నే లక్ష్యంగా చేసుకొని బౌన్సర్లు సంధిస్తున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ స్టెప్ ఔటై ఆడేందుకు ఇష్టపడుతాడు. న్యూజిలాండ్ బౌలర్లు కూడా విరాట్ కోహ్లీపై బౌన్సర్లు సంధించారు. ఇలా చాలా తెలివైన పనే. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు ప్రయత్నించే వ్యూహాలన్నింటి గురించి కోహ్లీకి తెలుసు.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కోహ్లీ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్ల్లో కలిపి 97 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉండటం గమనార్హం.