టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, పరుగులు చేయాలనే ఆత్రంతోనే విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ వైఫల్యం ఇలానే కొనసాగితే రోహిత్ శర్మతో పాటు జట్టుకు పెద్ద సమస్యగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్తో తొలి వన్డేలో 2 పరుగులే చేసి వెనుదిరిగాడు. గత 6 నెలలుగా రెండు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 16 ఇన్నింగ్స్ల్లో 166 పరుగులు చేశాడు.
మిగతా ఫార్మాట్లతో పోల్చితే వన్డే ఫార్మాట్లో ఆటగాళ్లు ఫామ్ దొరకబుచ్చుకోవచ్చు. రోహిత్ శర్మ కూడా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఫామ్లోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన సంజయ్ మంజ్రేకర్ అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని చెప్పాడు.

'రోహిత్ శర్మ ప్రస్తుతం విషమ దశను ఎదుర్కొంటాడు. ప్రతీ ఆటగాడికి కెరీర్లో ఇలాంటి ఫేజ్ ఉంటుంది. నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దాంతోనే అతను ఔటవుతున్నాడు. వీలైనంత త్వరగా అతను ఫామ్లోకి రావాలి. టాప్-3లో.. ఓపెనర్గా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో రోహిత్కు బాగా తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ ఇలానే విఫలమైతే మాత్రం జట్టుతో పాటు అతనికి పెద్ద సమస్యగా మారుతోంది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్తో ఆదివారం రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లోనైనా రోహిత్ రాణిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి మెగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు జరగనున్నాయి.