ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో దారుణంగా విఫలమైన టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్పై మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. మూడు మ్యాచ్ల్లో విఫలమైన కరుణ్ నాయర్కు మరో అవకాశం అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్ల్లో ఆడించడమే ఎక్కువన్నాడు. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ను ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.
8 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఒక్క అవకాశం అంటూ భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ 6 ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 6 ఇన్నింగ్స్ల్లో 0, 20, 31, 26, 40, 14 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. తనకు దక్కిన శుభారంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోయాడు. అతని వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. మరోవైపు తొలి టెస్ట్ మాత్రమే ఆడిన సాయి సుదర్శన్ 0, 31 పరుగులే చేశాడు. దాంతో అతన్ని తప్పించి కరుణ్ నాయర్ను మూడో స్థానంలో టీమిండియా మేనేజ్మెంట్ ఆడించింది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు.

తాజాగా కరుణ్ నాయర్ వైఫల్యం గురించి మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. అతన్ని పక్కనపెట్టి సాయి సుదర్శన్ను ఆడించాలని సూచించాడు. 'నా అభిప్రాయం ప్రకారం సాయి సుదర్శన్ను ఎప్పుడూ మూడో స్థానంలోనే ఆడించాలి. తొలి టెస్ట్లో అతను త్వరగానే ఔటైనా 30 పరుగులతో మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఫ్లాట్ ఫిచ్లపై బలహీనమైన ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ను ఎదుర్కోవాలంటే.. నెంబర్ 3లో యువ ఆటగాడినే ఆడించాలి. కరుణ్ నాయర్ను ఎట్టి పరిస్థితుల్లో మూడో స్థానంలో ఆడించవద్దు. సీనియర్ ఆటగాడైన కరుణ్ నాయర్కు మరో అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించవచ్చు. కానీ మూడో స్థానంలో మాత్రం సాయి సుదర్శన్ మాత్రమే ఆడాలి.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో 2-1తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. సిరీస్పై ఆశలు సజీవంగా ఉండాలంటే..బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకం. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. రిషభ్ పంత్తో పాటు అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.