టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ గురించి ఆందోళన అవసరం లేదని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా.. టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ టోర్నీలో టీమిండియా ఏ ఒక్కడి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టి విజయాలతో అజేయంగా ఫైనల్ చేరింది. జట్టులోని ప్రతీ ఒక్కరు మెరుగైన ప్రదర్శన చేయగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్ల్లో 5 సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కనీసం ఫైనల్లోనైనా కోహ్లీ చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫామ్పై ఆందోళన అవసరం లేదని సంజయ్ మంజ్రేక్ అన్నాడు. కోహ్లీ ఫామ్ కంటే టీమ్ ఫామ్ ముఖ్యమని చెప్పాడు. 'టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. ఫైనల్లో కోహ్లీ కూడా రాణిస్తాడనే నమ్మకం ఉంది. తప్పకుండా టీమిండియా ప్రపంచకప్ టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నా. ప్రస్తుతం టీమిండియా సమష్టిగా రాణిస్తోంది.
ఏ ఒక్కరిపైనో ఆధారపడటం లేదు. అది టీమిండియాకు కలిసొచ్చే అంశం. సౌతాఫ్రికా జట్టులో నొకియా, రబడా,డికాక్ కీలక ప్లేయర్లు. సౌతాఫ్రికా పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే టీమిండియా గెలవడం పెద్ద కష్టమేం కాదు.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో విఫలమయ్యాడు. ఈ ప్రపంచకప్ ముందు ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. దాంతో టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీని ఓపెనర్గా ఆడించగా దారుణంగా విఫలమయ్యాడు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకుంటున్నాడు.
కోహ్లీ తన సహజ శైలికి భిన్నంగా ఆడుతుండటంతోనే విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. సహజంగా విరాట్ కోహ్లీ స్లోగా ఆడుతూ లూజ్ బాల్స్ను మాత్రమే బౌండరీకి తరలిస్తాడు. చివర్లో దూకుడుగా ఆడి స్ట్రైక్రేట్ను పెంచుకుంటాడు. కానీ ఈ టోర్నీలో టీమ్ మేనేజ్మెంట్ ఆదేశాలతో తొలి బంతి నుంచే అటాకింగ్ చేస్తున్నాడు. దాంతో వికెట్ పారేసుకుంటున్నాడు.