ముంబై: భారత క్రికెట్ జట్టులోకి ఫాస్టెస్ట్ స్ప్రింటర్ వచ్చేదాకా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ విషయాన్ని ధోనీయే తనతో చెప్పినట్లు తెలిపాడు.
'రన్నింగ్లో ధోనీని ఓడించే మొనగాడు టీమ్లోకి రావాలి. అప్పటి వరకు మహీ రిటైర్మెంట్ గురించి ఆలోచించడు. ఎందుకంటే రన్నింగ్లో తనని ఓడించే వారు వచ్చే వరకు అంతర్జాతీయ క్రికెట్కు సరిపోయే ఫిట్నెస్ ఉన్నట్లు భావిస్తానని ధోనీ నాతో చెప్పాడు. విరాట్ కోహ్లీ వివాహం సందర్భంగా మా ఇద్దరి మధ్య జరిగిన చిన్న సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. సచిన్, ధోనీ చాంపియన్ క్రికెటర్లు, క్రికెట్ ఫీల్డ్లో కనిపించినంతగా వీళ్లు పబ్లిక్ స్టేజ్లో కనిపించరు. చూడటానికి అలా ఉన్నా వీళ్లతో పోటీపడటం చాలా కష్టం'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఇక అప్కమింగ్ ఐపీఎల్లో ధోనీ కచ్చితంగా సత్తాచాటుతాడని ఈ కామెంటేటర్ జోస్యం చెప్పాడు. లీగ్లో ఉండే నలుగురైదుగురు మంచి ఫాస్ట్ బౌలర్లు మహీని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేరన్నాడు. 'ఐపీఎల్లో ధోనీ చాలా నిలకడగా ఆడతాడు. గతంలో చాలాసార్లు చూశాం. అంతర్జాతీయస్థాయిలో ఐదుగురు క్వాలిటీ బౌలర్లు ఉంటారు. కాబట్టి ఆడాలంటే కొద్దిగా ఇబ్బంది. కానీ ఐపీఎల్లో అలా కాదు. లీగ్ మొత్తం వెతికినా నలుగురైదుగురు మంచి బౌలర్లకు మించి దొరకరు. వీళ్లను హ్యాండిల్ చేయడం అతనికి పెద్ద లెక్క కాదు'అని ఈ ముంబై మాజీ ప్లేయర్ వెల్లడించాడు. ఇప్పటికే చైన్నైసూపర్ కింగ్స్కు మూడు టైటిళ్లు అందించిన ధోనీ.. 190 మ్యాచ్ల్లో 4432 రన్స్ చేశాడు.
కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2020 సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించగా.. ఫ్రాంచైజీలు ఈ నెల 20 తర్వాత దుబాయ్ వెళ్లేందుకు సమాయత్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో ఈ సీజన్ ఐపీఎల్ జరగనుంది.