
న్యూఢిల్లీ: ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలతో తరుచూ వివాదాల్లో నిలిచే భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. గతంలో రవీంద్ర జడేజా, హర్షాభోగ్లే పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తించి కామెంట్రీకి దూరమైన మంజ్రేకర్ తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై విమర్శలు గుప్పించాడు. అతని కంటే మెరుగైన బౌలర్లు భారత్లో చాలా మంది ఉన్నారని, టీ20 క్రికెట్కు షమీ పనికిరాడని పేర్కొన్నాడు. వెంటనే అతన్ని పక్కనపెట్టాలని సూచించాడు.
టీ20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా.. నేడు స్కాట్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ మీడియా చానెల్తో మాట్లాడిన మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా టీ20 జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
టీ20లకు కాకుండా ఇతర ఫార్మాట్లకు సరిపోయే ఆటగాళ్లను తొలగించి వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అతను సూచించాడు. దీనికి ఉదాహరణగా మహ్మద్ షమీని అతను పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్లో షమీ ఒక ఆద్బుతమైన పేసర్, అయితే పొట్టి ఫార్మాట్లో అతని కంటే మెరుగైన ఆటగాళ్ళు ఉన్నారని మంజ్రేకర్ చేప్పాడు.
'భారత్ టీ20 జట్టులో మార్పులు చేయవలిసిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత జట్టులో కొంతమంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో కాకుండా, ఇతర ఫార్మాట్లో ఆడేందుకు బాగా సరిపోతారు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. మహమ్మద్ షమీ కూడా ఈ జాబితాలో వస్తాడు. నా దృష్టిలో షమీ భారత క్రికెట్కు గొప్ప ఆస్తి.
మంచి నాణ్యమైన బౌలర్ కూడా. అయితే అది టెస్టు మ్యాచ్ల వరకే పరిమితం. టీ20ల్లో అతని ఎకానమీ 9 కి చేరింది. అతను అఫ్గానిస్తాన్పై బాగా బౌలింగ్ చేశాడని నాకు తెలుసు. అయితే టీ20 క్రికెట్లో మహ్మద్ షమీ కంటే మెరుగైన బౌలర్లు భారత్లో చాలా మంది ఉన్నారు'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.