న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ను ఉద్దేశించి వివాదాస్పదర కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో హర్షల్ పటేల్తో టీమిండియా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. గాయం నుంచి కోలుకొని.. భారీ అంచనాలతో బరిలోకి దిగిన హర్షల్ పటేల్ ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్లో విఫలమై నిరాశపర్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 49 పరుగులు ఇచ్చాడు.
ఈ క్రమంలో ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ పోటీల్లో హర్షల్ పటేల్ బౌలింగ్ సామర్థ్యంపై సంజయ్ మంజ్రేకర్ పలు అనుమానాలను లేవనెత్తాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో టీ20 ఫార్మాట్లో మ్యాచ్ ఆడలేదని, అందుకే హర్షల్ నైపుణ్యాలపై టీమిండియా దృష్టిసారించాలని సూచించాడు. బుమ్రా తిరిగి జట్టులోకి చేరడం.. షమీ స్టాండ్బైగా ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమని చెప్పాడు.
'హర్షల్ పటేల్ను మనం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఐపీఎల్లోనూ అతని ఆటతీరును చూశాం. పిచ్ పొడిగా ఉన్నప్పుడు తాను వేసే స్లో డెలివరీలు ఇంకా నెమ్మదించి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవి. గతంలో కొన్నిసార్లు 120 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించాడు. సాధారణ పేస్కు.. అతను వేసిన స్పీడ్కు పెద్ద తేడా లేదు. అందుకే ఫ్లాట్, బౌన్సీ, పేస్ పిచ్లపై ఇబ్బంది పడతాడని భావిస్తున్నా. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్లు ఇలాగే ఉంటాయి. టీమిండియా అతని నైపుణ్యాలను మరోసారి గమనించాల్సిన అవసరం ఉంది'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల భారత్ బౌలింగ్ వైఫల్యంతో మ్యాచ్లను ఓడినా పెద్దగా ఆందోళన చెందలేదని మంజ్రేకర్ చెప్పాడు. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో ఈ సమస్యకు చెక్ పడినట్లేనని పేర్కొన్నాడు. ''ఆసియా కప్లో ప్రతికూల ఫలితంతో నేను నిరాశ చెందా. కానీ ఆసీస్తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓడినా నిరుత్సాహ పడలేదు. ఎందుంకటే సీనియర్లు వస్తే బౌలింగ్ దళం పటిష్టంగా మారుతుంది'' అని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.