ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ సరైన ఫ్రాంచైజీకి ఆడలేదని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), ఢిల్లీ డేర్ డేవిల్స్ల కారణంగానే డివిలియర్స్ ఐపీఎల్ టైటిల్ అందుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. ఈ రెండు జట్లు డివిలియర్స్ను సరిగ్గా ఉపయోగించుకోలేదని చెప్పాడు.
ఏబీ డివిలియర్స్కు భారత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. భారత అభిమానులు ఆదరించే అతి తక్కువ విదేశీ ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. 360 ఆటతో అభిమానుల మనసులను గెలుచుకున్న డివిలియర్స్.. ఐపీఎల్లో ఎన్నో విన్యాసాలు చేశాడు. ఐపీఎల్ ఆరంభంలోనే ఢిల్లీ డేర్డేవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిథ్యం వహించిన ఏబీ డివిలియర్స్.. ఆ తర్వాత ఆర్సీబీకి ఆడాడు. దాదాపు 11 ఏళ్ల పాటు ఆ జట్టులోనే కొనసాగి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడి 39.71 సగటు, 151.69 స్ట్రైక్రేట్తో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలతో పాటు 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ ఐపీఎల్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
తాజాగా ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. డివిలియర్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డివిలియర్స్ను ఆర్సీబీ, ఢిల్లీ సరిగ్గా వాడుకోలేదని చెప్పాడు.
'మిస్టర్ 360గా ఏబీ డివిలియర్స్ను సూర్యకుమార్ యాదవ్ డామినేట్ చేశాడు. మ్యాచ్ విన్నింగ్ ఇంపాక్ట్ పరంగా ఏబీడీ కంటే సూర్యనే బాగా రాణించాడు. డివిలియర్స్ అద్భుతమైన ఆటగాడు. టెస్ట్ల్లో అతని యావరేజ్ 50. వన్డేల్లో 53గా ఉంది. కానీ టీ20 క్రికెట్లో మాత్రం అతని సగటు తక్కువగా ఉంది.
ఎన్నో శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయి. కానీ ఐపీఎల్లో అందుకు తగ్గట్టుగా అతన్ని ఉపయోగించుకోలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా ముందు ఆడించాల్సింది. డివిలియర్స్ సరైన జట్టుకు ఆడలేదు. ఇతర జట్లకు ఆడి ఉంటే ఏబీ డివిలియర్స్ గొప్ప తనాన్ని మనం చూసేవాళ్లం.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.