
ఫాస్ట్ బౌలర్ లాగా:
లెగ్ స్పిన్నర్ అయినప్పటికీ ఫాస్ట్ బౌలర్ లాగా బ్యాట్స్మన్లను భయపెట్టిన అరుదైన క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకరు అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడేరోజుల్లో కుంబ్లే బౌన్సర్లు వేసేవాడని, వాటిని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ విసిరే బంతుల్లా బ్యాట్స్మెను ఎదుర్కోవాల్సి వచ్చేదని సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు. దీంతో కుంబ్లేకు చాలా పేరొచ్చిందన్న మంజ్రేకర్.. ఈ కారణంగా అందరూ కుంబ్లే గురించి మాట్లాడుకునేవారని తెలిపాడు. టీమిండియా తరఫున ఇద్దరూ కలిసి 17 టెస్టులు, 40 వన్డేలు ఆడారు.

స్పిన్నరే కానీ.. అలా కనిపించడు:
స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్లో ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్ లీ, భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రాతో పాటు సంజయ్ మంజ్రేకర్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కుంబ్లేపై తన తొలి అభిప్రాయాన్ని మంజ్రేకర్ వివరించాడు. 'ఓ పొడవాటి లెగ్స్పిన్నర్ ఉన్నాడు. కానీ చూడటానికి అతను అసలు స్పిన్నర్లా కనిపించడు అని అందరూ అనుకునేవారు. డొమెస్టిక్ క్రికెట్ ఆడే రోజుల్లో కుంబ్లే బౌన్సర్లు వేసేవాడు. వాటిని బ్రెట్ లీ విసిరే బంతుల్లా బ్యాట్స్మెను ఎదుర్కోవాల్సి వచ్చేది' అని మంజ్రేకర్ చెప్పాడు. మంజ్రేకర్ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ రంజీ ట్రోఫీలో కుంబ్లేతో ఆడాడు. ఆ సమయంలో కుంబ్లే కర్ణాటక తరపున ఆడేవారు.

కోచ్గా కూడా:
భారత్ తరఫున 132 టెస్ట్లు, 272 వన్డేలు ఆడిన కుంబ్లే.. రెండు ఫార్మాట్లలో కలిపి 956 వికెట్లు తీసారు. ఇక 2007-2008 వరకు భారత జట్టుకు సారథ్యం కూడా వహించారు. ఏడాది కాలం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఉన్నారు. కుంబ్లే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కోచ్ పదవి నుండి తప్పుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మొదట్లో బాగానే ఉన్నా.. జంబో తరహా క్రమశిక్షణ విరాట్కు నచ్చలేదు. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావడంతో.. కుంబ్లేనే హుందాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. మాజీ లెగ్ స్పిన్నర్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్గా ఉన్నాడు.

వివాదాల్లో మంజ్రేకర్:
ఇక సంజయ్ మంజ్రేకర్ భారత్ తరఫున 37 టెస్ట్లు, 74 వన్డేలు ఆడాడు. ఆపై వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. మంజ్రేకర్కు మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉంది. అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. దీంతో గత మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో మంజ్రేకర్పై బీసీసీఐ వేటు వేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2020కి త్వరలో కామెంట్రీ ఫ్యానల్ని బీసీసీఐ ప్రకటించబోతోంది. దీంతో ఆ ఫ్యానల్లోకి తనని తీసుకోవాలని అభ్యర్థిస్తూ మంజ్రేకర్ తాజాగా బీసీసీఐకి లేఖ రాశాడు.
'దానికోసం రోజులు లెక్కేస్తూ గడుపుతున్నా.. వేచి ఉండలేకపోతున్నా'


Click it and Unblock the Notifications












