భారత సెలెక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. శుభ్మన్ గిల్ కోసం శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టడం సరికాదని మండిపడ్డాడు. ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సూర్యకుమార్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. దాంతో సెలెక్షన్ కమిటీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ జట్టు గురించి మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. శ్రేయస్ అయ్యర్ అత్యుత్తమ ప్రదర్శకు రివార్డ్గా నిరాశే మిగిలిందన్నాడు. 'ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. గతంలో దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంతో అతన్ని భారత జట్టు నుంచి తప్పించారు. కానీ ఆ నిర్ణయం శ్రేయస్ అయ్యర్పై తీవ్ర ప్రభావం చూపింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో సిరీస్కు రీఎంట్రీ ఇచ్చినప్పుడు అతను ఎప్పుడూ లేనంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టులో నుంచి తప్పించలేని పరిస్థితిని తీసుకొచ్చాడు.

ఆ సిరీస్లో అతను ఒక్క తప్పు కూడా చేయలేదు. ఆ తర్వాత అదే ఫామ్ను ఐపీఎల్ 2025 సీజన్లోనూ కొనసాగించాడు. 50కి పైగా సగటు, 170కి పైగా స్ట్రైక్ రేట్తో తన జట్టుకు అసాధారణ విజయాలు అందించాడు. అతనిలా నిలకడగా రాణించిన బ్యాటర్ మరకొరు లేరు. కానీ అతని అద్భుత ప్రదర్శనకు రివార్డ్గా నిరాశే ఎదురైంది. భారత టీ20 జట్టులో చోటే దక్కలేదు. ఒక ఫార్మాట్లో రాణించిన ఆటగాడిని మరో ఫార్మాట్లోకి ఎంపిక చేసే ధోరణి ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఇది ఈ మధ్యే కాదు చాలా రోజులుగా చూస్తున్నా.
టెస్ట్ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాడిని టీ20ల్లోకి తీసుకోవడం వెనుక ఉన్న లాజిక్ ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇది ఏ విధంగా సమంజసంగా అనిపించదు. గత కొన్ని నెలలుగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిని పక్కనపెట్టి.. పూర్తిగా భిన్నమైన ఫార్మాట్లో రాణించిన ఆటగాడిని సెలెక్ట్ చేయడం సరికాదు. టీ20ల్లో రాణించిన ఆటగాడిని ఎంపిక చేయాలి. టెస్ట్ క్రికెట్లో బాగా ఆడాడని, టీ20 జట్టులోకి తీసుకోవడం.. అది కూడా శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాడిని పక్కన పెట్టి ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు.'అని శుభ్మన్ గిల్ ఎంపికపై సంజయ్ మంజ్రేకర్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.