
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ లాంటి ఆటగాడు తరానికొకరు ఉండాలన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్ను నెగ్గడంలో రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. కీలక మూడో వన్డేలో హార్దిక్ పాండ్యతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకోవడంతో పాటు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసిన పంత్(125 నాటౌట్) తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. విమర్శకులకు తన ఆటతోనే బదులిచ్చాడు. పంత్ అసాధారణ ఇన్నింగ్స్తో
మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తేడాతో కైవసం చేసుకుని ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ముగించింది.
ఈ క్రమంలో రిషభ్ పంత్ ప్రదర్శనపై స్పందించిన మంజ్రేకర్ అతని ఆటతీరు తననెంతో ఆకట్టుకుందని తెలిపాడు. 'రిషభ్ పంత్ ఎప్పుడూ బాధ్యతాయుతంగానే ఆడుతాడు. అయితే కొన్నిసార్లు ఔటైన సందర్భాల్లో మాత్రం బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. ఎవరైనా సరే దూకుడుగా ఆడేటప్పుడు పెవిలియన్కు చేరతారు. రిషభ్ ఎటాకింగ్గా ఆడటం వల్లే చాలా మ్యాచుల్లో విజయం సాధించగలిగాం. కొన్ని ప్రత్యేకమైన షాట్లు కొడతాడు. అందుకే చెబుతున్నా.. స్వతహాగా బాధ్యత తీసుకోకపోతే దూకుడుగా ఆడలేరు.

ఈ విషయంలో పంత్ అద్భుతమనే చెబుతా. టెస్టు క్రికెట్లో అతడి రికార్డు చూస్తేనే అర్థమైపోతుంది. పంత్ స్వతహాగా బాధ్యత తీసుకున్నాడని గట్టిగా చెప్పగలను. ఎంతో నిశ్శబ్దంగా చేయాల్సిన పనిని చేసేస్తాడు. అందుకే పంత్ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటా. ఇటువంటి ఆటగాళ్లే టీమ్ఇండియాకు కావాలి. ప్రతి తరంలో ఇలాంటి బ్యాటర్లను తయారు చేసుకోవాలి'' అని మెచ్చుకున్నాడు.