రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు, ఐపీఎల్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ హెచ్చరించాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడికి అసలు సవాల్ ఇప్పుడే ఎదురవుతుందని, ముఖ్యంగా క్రికెటేతర విషయాలను డీల్ చేయడం చాలా ముఖ్యమని చెప్పాడు. లేకుంటే మరో పృథ్వీ షాలా తయారయావుతాడని హెచ్చరించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేయడమే కాకుండా 35 బంతుల్లోనే సెంచరీ బాది సరికొత్త చరిత్ర లిఖించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ముఖ్యంగా అతని ఫియర్లెస్ అప్రోచ్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ..36 యావరేజ్తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీతో పాటు సెంచరీ ఉంది. స్ట్రైక్రేట్ 206.56 కావడం విశేషం.

వైభవ్ సూర్యవంశీ గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సంజయ్ బంగర్.. ఈ టీనేజర్కు విలువైన సలహా ఇచ్చాడు. తనకు వచ్చిన హైప్ను పట్టిచ్చుకోకుండా క్రికెట్పై మాత్రమే ఫోకస్ పెట్టాలని సూచించాడు. 'వైభవ్ సూర్యవంశీకి అసలు ఛాలెంజ్ ఇప్పుడే. క్రికెటేతర విషయాలను ఎదుర్కోవడం కీలకం. ప్రస్తుతం అతను తనకు వచ్చిన పేరు, ప్రఖ్యాతలకు ఏ మాత్రం పొంగిపోవద్దు. అదే అతనికి అతిపెద్ద సవాల్.
అంతేకాకుండా, అతను అదే రకమైన ఆట ప్రణాళికను కొనసాగించగలడా? ఎందుకంటే అతనికి దేవుడిచ్చిన వరమా? లేక చాలా కష్టపడి నేర్చుకున్నాడా? అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అయితే పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని, కొంచెం ఆట తీరు మార్చుకోవాలనే సలహాలు వినిపిస్తాయి. వీటిని అధిగమించి నిలకడగా ఆడితే మాత్రం స్పిన్, పేస్ను సమర్థవంతంగా ఆడే ఆటగాడు భారత జట్టుకు సొంతమవుతాడు. అతని ఆటలో నాకు నచ్చింది ఏమిటంటే ఆఫ్సైడ్ అద్భుతమైన షాట్స్ ఆడటం. కవర్స్ మీదుగా, ఆఫ్ సైడ్ కవర్ డ్రైవ్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. అతనిలో చాలా ప్రతిభ ఉంది. కాబట్టి అతను ఈ నిలకడను కొనసాగించాలి.'అని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.