
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ ముగిసిపోలేదని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అతను మళ్లీ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నాడు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలో దారుణంగా విఫలమైన శిఖర్ ధావన్.. శ్రీలంకతో వన్డే సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ధావన్కు దారులు మూసుకుపోయాయి.
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో ధావన్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడ్డట్లేనని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే సంజయ్ బంగర్ మాత్రం రానున్న వన్డే జట్టులో ధావన్ రీఎంట్రీని కొట్టిపారేయలేమని అన్నాడు.
'శిఖర్ ధావన్ అవకాశాల విషయంలో నేను ఇప్పటికీ నమ్మకంగానే ఉన్నాను. ఎందుకంటే, అతను చాలా ఫిట్గా ఉన్నాడు. గొప్పగా ఆడుతున్నాడు. ఇటీవల ఓ రెండు సిరీస్లలో ఎక్కువ పరుగులు చేయలేకపోయినప్పటికీ.. అతడు భారత్ తరఫున యువ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ధావన్ తిరిగి జట్టులోకి రావచ్చు. ఎందుకంటే కుడి, ఎడమ చేతివాటం గల కాంబినేషన్లో భారత్ గొప్ప విజయాలను అందుకున్న సందర్భాలున్నాయి. 2011 ప్రపంచకప్ జట్టులో గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ వంటి లెఫ్ట్ హ్యండర్ ఆటగాళ్లు ఉన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి లెఫ్ట్ హ్యాండర్లు ఆటపై కీలక ప్రభావం చూపగలరనే విషయం స్పష్టమవుతోంది'అని బంగర్ పేర్కొన్నాడు. ఒకవేళ ఇషాన్ వంటి ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ సమయానికి అందుబాటులోకి లేకపోతే ధావన్ జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ మాజీ కోచ్ పేర్కొన్నాడు.
ఇటీవల బంగ్లాదేశ్తో సిరీస్లో ఇషాన్ కిషన్ ద్విశతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. శుభ్మన్ గిల్ సైతం ఈ ఫార్మాట్లో నిలకడగా ఆడుతూ రాణించాడు. దీంతో ధావన్కు అవకాశాలు సన్నగిల్లాయి. శ్రీలంకతో టీ20 సిరీస్ అనంతరం ఈ నెల 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్కతా, తిరువనంతపురం వేదికలుగా వన్డే సిరీస్ జరగనుంది.