తానే మహేంద్ర సింగ్ ధోనీ అయితే ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేవాడినని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ధోనీ 17 బంతుల్లో ఓ సిక్స్తో 16 పరుగులు చేశాడు. అతని స్లో బ్యాటింగ్ సీఎస్కే విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ధోనీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ నుంచి ధోనీ తప్పుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ధోనీ మాత్రం తన రిటైర్మెంట్పై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. గత ఐదేళ్లుగా అతని రిటైర్మెంట్పై ప్రచారం జరుగుతుంది. ధోనీ మాత్రం ప్రతీ సీజన్ ఆడుతూనే ఉన్నాడు. అయితే ఈ సీజన్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తానే ధోనీ స్థానంలో ఉంటే ఇప్పటికే ఆట నుంచి తప్పుకునేవాడినని తెలిపాడు. ధోనీ ఉన్నా.. లేకున్నా చెన్నై ఫ్రాంచైజీ అభివృద్ధి చెందుతుందని తెలిపాడు.

'రిటైర్మెంట్ అనేది ధోనీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నేనే ధోనీ అయితే మాత్రం క్రికెట్ ఆడింది ఇక చాలని భావిస్తా. ఫ్రాంచైజీ ప్రయోజనాలు కూడా నేరవేర్చాను కాబట్టి సంతోషంగా ఆటకు వీడ్కోలు పలికేవాడిని. జట్టులో మార్పు అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి రిటైర్మెంట్ తీసుకోవడానికి అనువైన సమయం అంటూ ఏదీ ఉండదు. తాను నిష్క్రమించినా అభివృద్ధి దానంతట అదే జరుగుతుందనేది ధోనీ గ్రహించాలి.'అని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ధోనీ 13 మ్యాచ్ల్లో 135.17 స్ట్రైక్రేట్తో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. లోయరార్డర్లో బరిలోకి దిగిన ధోనీ.. కొన్ని మ్యాచ్ల్లో పర్వాలేదనిపించినా.. మరికొన్ని మ్యాచ్ల్లో సరైన ఫినిషర్ పాత్ర పోషించలేదు. మే 25న గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ఆడనుంది.