టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తప్పించడాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తప్పుబట్టాడు. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంతో హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో హార్దిక్ పాండ్యా గాయంతో తప్పుకోకపోయి ఉంటే టీ20 ప్రపంచకప్ 2024లోనూ అతనికే సారథ్య బాధ్యతలు దక్కేవని అభిప్రాయపడ్డాడు.
గాయంతో జట్టుకు దూరమవ్వడం.. ఐపీఎల్లో పేలవ ఫామ్తో సతమతమవ్వడంతో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా టీ20 ప్రపంచకప్ 2024 ఆడాడు. అటు బంతితో ఇటు బ్యాట్తో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్ విజేతగా నిలిచిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ రూపంలో ప్రమోషన్ లభిస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ను సాకుగా చూపిస్తూ.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాడు. టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసిన గంభీర్.. అతనికి డిప్యూటిగా శుభ్మన్ గిల్ను ఎంచుకున్నాడు. దాంతో హార్దిక్ పాండ్యా సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు.
ఈ వ్యవహారంపై స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో మాట్లాడిన సంజయ్ బంగర్.. హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డాడు. 'దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు సారథిగా సూర్యకుమార్ యాదవ్కు మంచి అనుభవం ఉంది. జట్టులోని ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. కాబట్టి సూర్యను కెప్టెన్ చేయడంలో ఎలాంటి తప్పిదం లేదు. అతను కెప్టెన్గా సత్తా చాటుతాడనే నమ్మకం నాకు ఉంది. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించడం అన్యాయంగా అనిపిస్తోంది.
అసలు టీ20 సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు ఇవ్వకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ ముందు హార్దిక్ పాండ్యా గాయపడకుండా ఉంటే.. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతలే అందుకునేవాడు కాదు. హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా కొనసాగేవాడు. భారత జట్టు ఓ డైరెక్షన్ ఎంచుకున్న తర్వాత ఇలా యూటర్న్ తీసుకోవడం జట్టుకు ఇబ్బంది కలిగించవచ్చు.
అయితే కెప్టెన్సీ మార్పు విషయంపై హార్దిక్ పాండ్యాతో హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఆటగాడిగా సెలెక్టర్లు ఏం చేయబోతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొత్త కోచ్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి. కెప్టెన్సీ మార్పుతో హార్దిక్ బాధపడి ఉంటాడని నేను కచ్చితంగా చెప్పగలను.'అని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.