టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. లింగ మార్పిడి చికిత్సతో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అనయ బంగర్.. కొందరు క్రికెటర్లు తనకు నగ్న చిత్రాలు పంపి వేధించారని తెలిపింది. ఓ వెటరన్ క్రికెటర్ తనతో పడుకుంటావా? అని అడిగాడని ఆరోపించింది. కుటుంబ సభ్యులకు దూరంగా లండన్లో ఉంటున్న అనయ బంగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'నా 9 ఏళ్ల వయసులోనే మా అమ్మ దుస్తులు వేసుకోవడం అలవాటైంది. ఎవరూ లేనప్పుడు వాటిని ధరించి అద్దంలో చూసుకున్నా. అప్పుడే నేను అమ్మాయిని అనే విషయం అర్థమైంది. అబ్బాయిగా ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడా. ఇప్పుడున్న యువ క్రికెటర్లు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్లతో కలిసి నేను ఆడాను. కానీ ఏ రోజు నా గురించి వారికి చెప్పలేదు. మా నాన్ని అందరికి తెలిసిన క్రికెటర్ కావడంతో నాలోని ఆడ లక్షణాల గురించి ఎవరితో పంచుకోలేదు.

నేను అమ్మాయిగా మారననే విషయం తెలిసాకా.. నా సహచర ఆటగాళ్లు కొందరు అండగా నిలిస్తే మరికొందరు మాత్రం వేధింపులకు గురిచేశారు. కొందరు క్రికెటర్లు నగ్న చిత్రాలు పంపేవారు. ఒకడైతే అందరి ముందు అండగా ఉంటూ.. ఎవరూ లేనప్పుడు నన్ను వేధించేవాడు. నా నగ్న ఫొటోలు పంపమని ఒత్తిడి చేసేవాడు. భారత్లో ఉన్నప్పుడు ఓ వెటరన్ క్రికెటర్కు నా గురించి చెబితే.. నాతో పడుకుంటావా? అని అడిగాడు. క్రికెటర్ కావాలనేది నా కల. కానీ అమ్మాయిగా మారడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ట్రాన్స్జెండర్స్లపై ఐసీసీ నిషేధం విధించింది.'అని అనయ బంగర్ ఆవేదన వ్యక్తం చేసింది. అనయ బంగర్గా మారకమందు ఆర్యన్ బంగర్గా క్రికెట్ ఆడింది.