టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ బంగర్ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై సౌత్ ఇండియా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే సందర్భంగా కామెంట్రీలో సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
హిందీ జాతీయ భాష అంటూ అతను వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. సంజయ్ బంగర్పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. సంజయ్ బంగర్ సరిగ్గా చదవుకోలేదని, భారత్కు అధికారికంగా జాతీయ భాష లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్కు హిందీ కామెంటేటర్గా వ్యవహరించిన సంజయ్ బంగర్.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను వేగంగా బంతులు వేస్తుండటంతో నెమ్మదిగా వేయాలని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ హిందీలో సుందర్కు చెప్పాడు. అయితే ఆ మాటలను సుందర్ పట్టించుకోలేదు. ఆ తర్వాత రాహుల్.. తమిళంలో నెమ్మదిగా వేయాలని సూచించగా.. అప్పుడు సుందర్ స్లోగా బౌలింగ్ చేశాడు.

హిందీ కామెంట్రీ ప్యానెల్లో ఉన్న వరుణ్ అరోన్.. సుందర్కు హిందీ అంత బాగా రాదని, తమిళంలో ఎక్కువగా అర్థమవుతుందనే నా వాదనను అంగీకరిస్తారా? అని ప్రశ్నించాడు. దానికి సంజయ్ బంగర్.. హిందీ జాతీయ భాష అని నమ్ముతున్నానని, ఆటగాళ్లంతా నేర్చుకోవాలని బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కాగా.. సౌతిండియా నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'ఎవడ్రా హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నది, భారత రాజ్యాంగంలో ఉన్నదా?'అని ప్రశ్నిస్తున్నారు. భారత్కు అధికారిక జాతీయ భాష లేదనే విషయాన్ని తెలుసుకోవాలని సంజయ్ బంగర్కు హితవు పలుకుతున్నారు.
Pretty unnecessary from Sanjay Bangar! Got offended there for absolutely no reason https://t.co/78t7Wvca2Y
— Nish Navalkar (@YUVI_NISH) January 11, 2026
గత కొంత కాలంగా ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. హిందీ అధికారిక భాష అని కొందరంటే.. ఉత్తర భారత దేశానికి చెందిన హిందీని తమపై రుద్దడం మానుకోవాలని సౌతిండియా నాయకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ బంగర్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటూ చెప్పడం వివాదాస్పదమైంది.
ఈ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. అఅనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 306 పరుగులు చేసి గెలుపొందింది.. విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. శుభ్మన్ గిల్(71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు.