
లండన్: భారత్తో తొలి వన్డేలో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ ఆటగాళ్లను టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి, ప్రముఖ హోస్ట్ సంజనా గణేశన్ తనదైన శైలిలో ట్రోల్ చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల డకౌట్స్ను ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.
జస్ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్కు, మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ధాటికి జాసన్ రాయ్(0), జోరూట్(0), లివింగ్ స్టోన్(0) డకౌట్లు కాగా.. బెన్ స్టోక్స్(0)ను మహమ్మద్ షమీ డకౌట్ చేశాడు. నలుగు బ్యాటర్లు డకౌటవ్వడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది.
ఈ నాలుగు డకౌట్ల విషయాన్ని ప్రస్తావిస్తూనే ఓ వీడియో రూపంలో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ తీరును సంజనా విమర్శించింది. కెన్నింగ్టన్ ఓవల్లో 'డక్ వ్రాప్'అనే ఫుడ్కోర్ట్కు వెళ్లిన సంజనా అక్కడ క్రిస్పీ డక్ అనే స్టాల్ వద్ద నిల్చొని వీడియో చేసింది. 'ఇది ఒక ఫుడ్ ఏరియా. చాలా బిజీ ప్లేస్. ఇంగ్లీష్ అభిమానులతో ఇది నిండిపోయింది. ఎందుకంటే వాళ్లు ఇంగ్లండ్ బ్యాటింగ్ చూడటానికి ఏ మాత్రం ఇష్ట పడటం లేదు.
ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బ్యాటర్లు ఏ మాత్రం ఇష్టపడని స్టాల్ దగ్గరకు నేను వచ్చాను. దీనిని క్రీస్పీ డక్ అంటారు. భారత బౌలర్ల ధాటికి మైదానంలో డక్లు హడావుడి చేస్తుండటంతో బయట ఉన్న డక్స్ను ఆస్వాదించేందుకు ఇక్కడికి వచ్చాం'అంటూ ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
ఇంగ్లండ్ విధించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడారు. భారత పేసర్లు విజృంభించిన పిచ్ మీద ఇంగ్లిష్ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్.