టీమిండియా స్టార్ పేసర్, ముంబై ఇండియన్స్ యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వినోదం కోసం తమ కుమారుడు అంగద్ బుమ్రా టాపిక్ను సోషల్ మీడియాలోకి తీసుకురావద్దని సూచించింది. ఏడాదిన్నర వయసున్న తన కొడుకుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసేందుకు సిగ్గుండాలని మండిపడింది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్కు సంజనా గణేశన్, తన కుమారుడితో కలిసి హాజరైంది.
జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీసినప్పుడు అంగద్ చప్పట్లు కొడుతున్న సన్నివేశం టీవీ కెమెరాల్లో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు. ముఖ్యంగా ఆ చిన్నారి ఎక్స్ప్రెషన్స్పై జుగుప్సాకరమైన పోస్ట్లు పెట్టారు. వాటిపై తీవ్ర ఆగ్రహానికి గురైన సంజనా గణేశన్.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు హెచ్చరిస్తూ.. ఓ సుదీర్ఘ పోస్ట్ను పంచుకుంది.

'అంగద్ బుమ్రాను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కొందరు ఎంత నీచంగా ప్రవర్తిస్తారో మాకు బాగా తెలుసు. వేల కెమెరాలు ఉండే స్టేడియానికి నా కొడుకును తీసుకురావడం వల్ల వచ్చే ఇబ్బందులు నేను అర్థం చేసుకోగలను. కానీ, బుమ్రాకు అండగా ఉండేందుకే మేం మైదానానికి వచ్చాం. మా కుమారుడు జాతీయ మీడియాలో గానీ.. నెట్టింట గానీ వైరల్ అవ్వాలన్న ఆసక్తి మాకు లేదు.
కేవలం 3 సెకన్ల వీడియోతోనే కొంతమంది నెటిజన్లు అంగద్పై అనవసర చర్చలు జరిపారు. ఏడాదిన్నర వయసున్న పసివాడిపై ఆ కామెంట్స్ చూస్తుంటే.. సమాజం ఎటు పోతుందోనని భయంగా ఉంది. మా కొడుకు గురించి.. మా జీవితాల గురించి మీకేం తెలియదు. కాస్త నిజాయితీగా ఉండండి. ఇతరుల పట్ల దయతో వ్యవహరించండి.'అని సంజనా తన పోస్ట్లో పేర్కొంది.
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లక్నో సూపర్ జెయింట్స్పై 54 పరుగుల తేడాతో గెలిచిన ముంబై.. పాయింట్స్ టేబుల్లో టాప్-3లోకి దూసుకొచ్చింది. ప్లే ఆఫ్స్ బెర్త్కు రెండు విజయాల దూరంలో నిలిచింది.