మూడు సార్లు గర్భవతి అవ్వడం కంటే పిల్లలకు పాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అని భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తెలిపారు. తన కుమారుడికి పాలిచ్చే సమయంలో తీవ్ర మానసిక వేదనను అనుభవించినట్లు చెప్పారు. తల్లైన అనుభవాలు, ఆట నుంచి వీడ్కోలు కావడానికి గల కారణాలను ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
'గర్భధారణ కంటే పాలివ్వడమే చాలా కష్టంగా అనిపించింది. మరో మూడు సార్లు గర్భవతి అయ్యేందుకు నేను సిద్దమే. కానీ పిల్లల ఆకలి తీర్చడం, వారికి పాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఎందుకంటే పాలివ్వడం చాలా కష్టమైన పని. పిల్లల ఆకలి తీర్చే బాధ్యత మనపై ఉంటుంది. పాలిచ్చేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. ప్రొఫెషనల్ కెరీర్లో ఉన్నవారు.. ఉద్యోగాలు చేసే వారికి పాలు ఇవ్వడం కష్టమవుతోంది. పాలిచ్చే సమయానికి వేరే పనిలో ఉండాల్సి వస్తుంది.

గర్భధారణ అనేది అనేక హార్మన్లతో కూడుకున్న అంశం. ప్రెగ్నెన్సీ అనేది అందమైన అనుభవం. నా కొడుకు ఇజాన్కు పాలు ఇస్తున్నప్పుడు నేను అలసిపోయాను. నా కొడుక్కి మూడు నెలలు మాత్రమే పాలు ఇచ్చాను. నా బిడ్డకు పోషకాహరం అందించే ఏకైక వ్యక్తిగా ఉండటం మానసిక ఆందోళన కలిగించింది. అలాగే పసిబిడ్డతో నిద్ర లేకపోవడం, మానసిక కుంగుబాటు నన్ను వెంటాడాయి.
పాలు ఇవ్వడం నా వల్ల కాలేదు. వెంటనే వైద్యుడిని సంప్రదించా. మరో నెల పాలు ఇవ్వాలని డాక్టర్ చెప్పారు. కానీ నా వల్ల కాదని చెప్పాను. ఇటు తల్లిగా.. అటు ప్రొఫెషనల్ ప్లేయర్గా కొనసాగలేకనే ఆటకు వీడ్కోలు పలికాను. నా కొడుకుతో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. 'అని సానియా మీర్జా చెప్పుకొచ్చింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకొని ఓ కొడుకుని కన్న సానియా మీర్జా.. గతేడాది అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటుంది.