ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ క్రికెట్ టీమ్పై ఆ జట్టు మాజీ మహిళా కెప్టెన్ సనా మీర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమ్ ఎంపిక సరిగ్గా లేదని అభిప్రాయపడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో పాక్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్కు రాగా.. ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడం.. ఆ టీమ్ ఫ్యాన్స్తో పాటు మాజీ ఆటగాళ్లను తీవ్రంగా నిరాశపర్చింది. దాంతో వారు పాక్ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
పాకిస్థాన్ పరాజయాలకు సరైన జట్టును ఎంపిక చేయకపోవడమే కారణమని సనా మీర్ అభిప్రాయపడింది. ప్రస్తుత పాకిస్థాన్ టీమ్తో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఏం చేయలేడని, అతను సారథ్యం వహించినా పరాజయాలే ఎదురవుతాయని తెలిపింది. 'ప్రస్తుత పాకిస్థాన్ జట్టుకు ధోనీ లేదా యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజ కెప్టెన్లను సారథిగా నియమించినా పరాజయాలే ఎదురవుతాయి. భారత్తో మ్యాచ్ చూస్తుండగా నా స్నేహితుడి నుంచి ఒక సందేశం వచ్చింది. భారత్ స్కోర్ 100/2.. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయినట్టే అని అందులో రాసుంది. జట్టును ప్రకటించినప్పుడు పాకిస్థాన్ ఓడిపోతుందని నాకు తెలుసని ఆ మెసేజ్కు బదులిచ్చాను.

నిబంధనలకు అనుగుణంగా టీమ్ ఎంపిక జరగలేదు. 15 మందితో కూడిన ఆ జట్టును ప్రకటించినప్పుడే సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని భావించాను. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన రెండు సిరీస్ల్లో ఆడిన కీలకమైన ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించారు'అని సనా మీర్ విమర్శించారు. భారత్తో పాటు న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్.. సెమీస్ చేరకుండా ఇంటిదారి పట్టింది. బంగ్లాదేశ్తో నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.