
లండన్: ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ కరోనా లక్షణాలతో బాధపడటం ఆ జట్టు ఆటగాళ్లను ఆందోళనకు గురిచేస్తుంది. మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జులై 8 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు బుధవారం రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
అయితే ఈ ప్రాక్టీస్ గేమ్లో పాల్గొని బ్యాటింగ్ కూడా చేసిన కరన్.. గురువారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మైదానం వదిలి విశ్రాంతి తీసుకున్న అతను.. అర్థరాత్రి డయేరియాతో బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో కరన్కు కరోనా పరీక్షలు నిర్వహించామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కరన్ కోవిడ్-19 రిపోర్టులు ఇంకా రాలేదని, అప్పటి వరకు జట్టు డాక్టర్ పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్కు ఉంటాడని తెలిపింది.
ఇక బయోసెక్యూర్ వాతావరణం.. ఐసీసీ తాత్కలిక నిబంధనలతో ఆడినా కరణ్ అస్వస్థతకు గురవ్వడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్లో క్రికెట్ రిస్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో కరణ్ కరోనా లక్షణాలతో బాధపడటం ఆందోళన కలిగిస్తుంది.
ఒకవేళ కరన్కు పాజిటీవ్ వస్తే ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికిప్పుడు ఆటగాళ్లందరిని ఐసోలేషన్ తరలిద్దామన్నా.. తొలి టెస్ట్ మరో ఐదు రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఇక ఈ సిరీస్ అనంతరం వచ్చే నెలలో ఇంగ్లండ్ పాకిస్థాన్తో మూడు టెస్ట్లు, మూడు టీ20లు ఆడనుంది.
టీమ్ బట్లర్, టీమ్ స్టోక్స్ జట్ల మధ్య ఈ ప్రాక్టీస్ గేమ్ జరగ్గా.. ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలు పాటిస్తూ కనబడటం నవ్వులు పూయించింది. స్టోక్స్ జట్టులో ఉన్న ఇంగ్లీష్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. బట్లర్ జట్టుపై చెలరేగాడు. రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ తొలి రోజు రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
వైరస్ వ్యాప్తి కారణంగా ఐసీసీ క్రికెట్లో పలు కీలక నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆండర్సన్ తోటి ఆటగాళ్లతో హైఫైలు చేయకుండా మోచేతి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సంబరాలు చూడటానికి చాలా కొత్తగా కనిపించాయి. దీనికి సంబందించిన వీడియో, ఫొటోలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి కాస్త వైరల్ అయ్యాయి.