మొహాలీ: పేలవ బ్యాటింగ్తో పాటు వర్షం వస్తుందేమోననే ఆలోచన తమ పతనాన్ని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలను వెల్లడించిన సామ్ కరణ్.. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు.
'మేం అద్భుతంగానే బౌలింగ్ చేశాం. కానీ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అసాధారణంగా ఆడారు. అయినా మేం వారిని తక్కువ స్కోర్కే పరిమితం చేశాం. కానీ పేలవ బ్యాటింగ్తో ఓటమి పాలయ్యాం. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దాంతో మేం వెంట వెంటనే వికెట్లు కోల్పోయాం. రెండు రనౌట్లు కూడా మా విజయవకాశాలను దెబ్బతీసాయి.

వర్షం వస్తుందనే భయం కూడా మా ఓటమిని శాసించింది. వికెట్ చాలా బాగున్నప్పటికీ ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయాం. మా బ్యాటింగ్ తీరును విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. శనివారం ముంబైతో జరిగే మ్యాచ్లో మేం సత్తా చాటుతాం. ముంబై వికెట్ మా బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది. అక్కడ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 84), విరాట్ కోహ్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 46), జితేశ్ శర్మ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. హసరంగా రెండు, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.