ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి సామ్ కరణ్ అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గత నాలుగు మ్యాచ్ల్లో పంజాబ్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
తాజా ఓటమి అనంతరం మాట్లాడిన సామ్ కరణ్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. 'మరో మ్యాచ్ను తృటిలో చేజార్చుకున్నాం. నాకు తెలిసి ఈ జట్టు రాతే ఇంత అనుకుంటా. కుర్రాడైన అషుతోష్ మరోసారి అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడితే జీర్ణించుకోవడం చాలా కష్టం. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది.

అయినా శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో జట్టును విజయం ముంగిట నిలిపారు. ఈ ఇద్దరూ సూపర్ కాన్ఫిడెన్స్తో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా పేసర్లపై అషుతోష్ శర్మ ఆడిన స్వీప్స్, భారీ సిక్సర్లే అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. అతని అసాధారణ ప్రదర్శన చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
కానీ గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకోవడం బాధగా ఉంది. మా జట్టులో చాలా సానుకూలంశాలు ఉన్నాయి. మాపై మాకు నమ్మకం ఉంది. ఈ పరిస్థితులను మేం మార్చగలం. సూర్యుడు రేపు ఉదయించినట్లే.. మేం విజయాలు సాధిస్తాం.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 78) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అషుతోష్ శర్మ(28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. శశాంక్ సింగ్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/21), గెరాల్డ్ కోయిట్జీ(3/32) మూడేసి వికెట్లు తీయగా..ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచిన పంజాబ్ ఇన్నింగ్స్ను అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో లక్ష్యానికి చేరువగా తీసుకొచ్చాడు. కానీ కోయిట్జీ బౌలింగ్లో అతను ఔటవ్వడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు.