చిన్న మైదానాలు, తేమ ప్రభావంతో క్రికెట్ కాస్త బేస్ బాల్గా మారిందని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి సామ్ కరణ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. బ్యాటర్ల బాదుడుకు బౌలర్లు చూస్తూ నిలబడిపోయారు.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సామ్ కరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ విజయం మాకు చాలా ముఖ్యం. చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ కాస్త బేస్ బాల్గా మారిపోయింది. గత కొన్ని వారాలు మాకు కఠినంగా గడిచాయి. కానీ మేం సరైన పరిస్థితుల్లో పుంజుకున్నాం. మా కుర్రాళ్లు కూడా చాలా కష్టపడ్డారు.
మేం పుంజుకోవడానికి కోచ్లు కూడా కీలక పాత్ర పోషించారు. చిన్న మైదానాలు, తేమ ప్రభావంతో బ్యాటర్లు చెలరేగుతున్నారు. రివ్యూలతో కూడా ఎక్స్ట్రా బాల్ వేయాల్సి వస్తుంది. కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని చేధించడం సంతోషంగా ఉంది. జానీ బెయిర్ స్టో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ టోర్నీలో మాకు దొరికిన ఆణిముత్యాలు శషాంక్ సింగ్, అషుతోష్. ప్రతీ ఒక్కరు గర్వపడే ప్రదర్శన ఇస్తున్నారు.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 28) మెరుపులు మెరిపించారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.