
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ వేలం జరుగుతున్న తీరుపై ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సామ్ బిల్లింగ్స్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాజా వేలంలో ఫ్రాంచైజీలన్నీ ఆల్రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లవైపు మొగ్గు చూపుతుండటంతో వారికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే క్రిస్ మోరీస్ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. జై రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు తీసుకుంది. ఇక ఆల్రౌండర్లు గ్లేన్ మ్యాక్స్వెల్ రూ.14.25 కోట్లు, షకీబ్ అల్ హసన్ 3.20 కోట్లు, మోయిన్ అలీ రూ. 7 కోట్లు, కృష్ణ ప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు భారీ ధరకు అమ్ముడుపోయారు.
ఇక రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సామ్ బిల్లింగ్స్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో అతనికి ఈ సారి నిరాశే ఎదురైంది. దీంతో అతను ట్విటర్ వేదికగా వేలం జరుగుతున్న తీరుపై తనదైన శైలిలో స్పందించాడు. బౌలర్గా ఎందుకు కాలేదని తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతుందని ట్వీట్ చేశాడు. 'ఐపీఎల్ వేలం చూసి నా గర్ల్ ఫ్రెండ్ సారా.. నువ్వు బౌలర్ ఎందుకు కాలేదని ప్రశ్నిస్తుంది'అని బిల్లింగ్స్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ట్వీట్పై భారత అభిమానులు స్పందిస్తూ.. సెకండ్ రౌండ్లో అవకాశం వస్తుందని ధైర్యం చెబుతున్నారు.
187 టీ20 మ్యాచ్లు ఆడిన సామ్ బిల్లింగ్స్ 6527 పరుగులు చేశాడు. స్ట్రైక్రేట్ 131.01గా ఉంది. 2018 ఐపీఎల్ వేలంలో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ కొనగోలు చేసింది. అంతకుమందు ఢిల్లీ డేర్డేవిల్స్కు అతను ప్రాతినిధ్యం వహించాడు.