ధోనీ, నేను కలిసి ఫుట్బాల్ చూసేవాళ్లం:
తాజాగా సామ్ బిల్లింగ్స్ క్రిక్బజ్తో మాట్లాడుతూ... 'మాంచెస్టర్ యునైటెడ్కి ఎంఎస్ ధోనీ పెద్ద అభిమాని. అతడితో స్నేహానికి నాకు ఈ విషయం కూడా ఉపయోగపడింది. మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ ఉన్నప్పుడల్లా మహీ ఆహ్వానించేవాడు. ధోనీ రూమ్లోనే కలిసి మ్యాచ్ చూసేవాళ్లం. మ్యాచ్ మొదలయినప్పటి నుంచి ఒకటే సందడి ఉంటుంది. ఆ సమయంలో మహీ బాగా ఎంజాయ్ చేస్తాడు' అని తెలిపాడు. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఎంఎస్ ధోనీనే. మూడుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు.
ధోనీని మించిన పెద్ద స్టార్ లేడు:
'ఎంఎస్ ధోనీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. విషయాలను నేర్చుకోవాలంటే అతడి కంటే అత్యుత్తమమైన వ్యక్తి మరొకరు ఉండరు. ధోనీ ఎదుటివారిని ఎంతో అర్థం చేసుకుంటాడు. తక్కువ సమయంలోనే మెదడును చదివేస్తాడు. ఎంజాయ్ చేసేలా తన పరిసరాలను మార్చేస్తాడు. ధోనీని మించిన పెద్ద స్టార్ లేడు' అని బిల్లింగ్స్ చెప్పాడు. కాగా కౌంటీ క్రికెట్పై దృష్టి సారించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ ఆడబోనని గత డిసెంబర్లోనే సామ్ బిల్లింగ్స్ ప్రకటించాడు. అంతర్జాతీయ కెరీర్లో బిల్లింగ్స్ ఇప్పటివరకు 17 వన్డేల్లో, 26 టీ20 మ్యాచ్ల్లో ఇంగ్లీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఐపీఎల్లో రాణిస్తాడు:
ఎంఎస్ ధోనీ ఏడాది కాలంగా ఆటకు దూరమైనా తన అనుభవంతో ఈసారి ఐపీఎల్లో రాణిస్తాడని సామ్ బిల్లింగ్స్ చెప్పాడు. ధోనీకున్న అనుభవంతో తనకేం కావాలో తెలుసని, ఆ విషయంలో అతడిని మించిన ఆటగాడు లేడని చెప్పాడు. మహీ పెద్ద సూపర్ స్టార్ అని ప్రశంసించాడు. అందరితో కలివిడిగా ఉంటూ, యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడని వివరించాడు. వారిలోని నైపుణ్యాలను బయటకు తీసుకువస్తాడన్నాడు. అలాగే లాక్డౌన్ కారణంగా చాలా రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆటగాళ్లు వ్యక్తిగతంగా త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టాలని సూచించాడు. టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటకు దూరమై ఏడాది గడుస్తోంది. మార్చిలో నిర్వహించిన చెన్నై శిక్షణా శిబిరంలో పాల్గొన్న అతడు మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ 2020 ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు.