
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సక్సెస్ను ఓర్వలేకనే అతనిపై అనవసర వ్యాఖ్యలతో నోరుపారేసుకుంటున్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. విరాట్ సెంచరీ చేసినప్పుడల్లా ఫ్లాట్ వికెట్పై చేశాడని, బలహీనమైన జట్టుపై సెంచరీ సాధించాడనే పనికిమాలిన విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో తొలి వన్డేలో సెంచరీబాదిన విరాట్.. కెరీర్లో 45వ వన్డే శతకంతో 2023ను ఘనంగా ప్రారంభించాడు. ఈ ఇన్నింగ్స్పై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన సల్మాన్ బట్.. విమర్శకులకు తనదైన శైలిలో చురకలంటించాడు.
'ఆసియాకప్లో అఫ్గానిస్థాన్పై విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. అఫ్గాన్కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అయినా కొందరు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడల్లా బలహీనమైన జట్టు, ఫ్లాట్ వికెట్పై సాధించాడని తరుచూ విమర్శిస్తారు. అయితే విరాట్ కోహ్లీ 73 సార్లు సెంచరీ చేశాడనే విషయం తెలియక అలా మాట్లాడుతారో ఏమో నాకు అర్థం కాదు. విరాట్ ఓ క్రికెట్ జీనియస్.'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు. క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకమైన ఇన్నింగ్స్గా అభివర్ణించాడు. 'టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైనది. అలాంటి ఫ్యాషన్తో ఆడటం అంత సులువైన పనికాదు. ముఖ్యంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో అలాంటి ఇన్నింగ్స్ ఓ ఆటగాడిని మరో స్థాయిలో నిలబెడుతోంది.'అని చెప్పుకొచ్చాడు.
శ్రీలంక చెత్త బౌలింగ్ కారణంగానే కోహ్లీ సెంచరీ చేయగలిగాడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సచిన్తో కోహ్లీని పోల్చవద్దన్నాడు. 'ఒకరి రికార్డులను మరొకరితో పోల్చడం సరైంది కాదు. వన్డే ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ సెంచరీలు సాధించే అవకాశం ఉంది. అయితే అప్పుడు, ఇప్పుడు నిబంధనలు చాలా మారిపోయాయి. గతంలో ఒకే కొత్త బంతిని తీసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు రెండు బంతులు తీసుకొంటున్నారు. అలాగే సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు ఉంటున్నారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతమైన ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.'అని గంభీర్ తెలిపాడు.