న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒత్తిడిలో ఆడలేడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు. ఇప్పటి వరకు కీలక మ్యాచ్ల్లో రోహిత్ రాణించింది లేదని గుర్తు చేశాడు. ఈ కారణం చేతనే విరాట్ కోహ్లీలా రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు కాలేకపోయాడని చెప్పుకొచ్చాడు. అప్కమింగ్ ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
శ్రీలంక వేదికగా జరిగే ఆసియాకప్ 2023 వన్డే టోర్నీలో సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వన్డే ప్రపంచకప్లో అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ల నేపథ్యంలో భారత టీమ్ కాంబినేషన్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా చర్చించిన సల్మాన్ బట్.. రోహిత్ శర్మకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రోహిత్ శర్మ చాలా పెద్ద ప్లేయర్. ఇది నేను ఒప్పుకుంటా. అతను ఎన్నో ఘనతలను అందుకున్నాడు. సుదీర్ఘ కాలం పాటు ఆడుతున్నాడు. అయితే కొందరు ప్లేయర్లు ఒత్తిడిని అస్సలు తట్టుకోలేరు. ఈ జాబితాలోకి రోహిత్ శర్మ కూడా వస్తాడు. ఒత్తిడిని అధిగమించి ఆడటం రోహిత్ శర్మ వల్ల కాదు.అందుకే నాకౌట్ మ్యాచుల్లో రోహిత్ శర్మ విఫలమవుతాడు.
ఇప్పటి వరకు కీలక మ్యాచ్ల్లో రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి గెలిపించినట్టు నాకైతే గుర్తు లేదు. జట్టుకి అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడూ బాగా ఆడింది లేదు. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు ఉన్న తేడా అదే. సాధారణ మ్యాచుల్లో బాగా ఆడితే మంచి ప్లేయర్ అని మాత్రమే అంటారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాగా ఆడితేనే గొప్ప ప్లేయర్ అవుతారు.
రిటైర్ అయ్యేలోపు రోహిత్ శర్మ అలాంటి ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది.'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు. 2014 నుంచి భారత్ బరిలోకి దిగిన అన్నీ ఐసీసీ టోర్నీల్లో ఆడిన రోహిత్ శర్మ నాకౌట్ మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 29 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో 34 పరుగులు చేసి నిరాశపరిచాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ టోర్నీ లీగ్ దశలో 5 సెంచరీలతో సూపర్ ఫామ్ కనబర్చిన రోహిత్.. నాకౌట్ మ్యాచ్లో మాత్రం ఒత్తిడి తట్టుకోలేకపోయాడు.
2021 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన రోహిత్ శర్మ, 2022 టీ20 వరల్డ్ కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. సెమీ ఫైనల్లో 28 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2021, 2023లోనూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు.