న్యూఢిల్లీ: పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఐపీఎల్ ఆడినంత ఈజీ కాదని ఆ జట్టు మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. తీవ్ర ఒత్తిడి ఉండే భారత్-పాక్ మ్యాచ్లో సత్తా చాటాలంటే ఎంతో అనుభవం ఉండాలని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు పూర్తిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడి ఉందని, ఈ ఇద్దరిని ఔట్ చేస్తే సునాయసంగా విజయం సాధించవచ్చని తెలిపాడు.
ఆసియాకప్ 2023లో భాగంగా శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత దాయాదీ దేశాలు తొలిసారి తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన సల్మాన్ బట్.. పాకిస్థాన్ను ఓడించే సత్తా ప్రస్తుత భారత జట్టుకు లేదన్నాడు.

'టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. పేస్ బౌలింగ్ యూనిట్లో ప్రధాన బౌలర్లందరికీ ఫిట్నెస్ సమస్యలున్నాయి. మహ్మద్ షమీ చాలా రోజులుగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ కూడా గాయంతో ఇబ్బంది పడి రీఎంట్రీ ఇస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్నాడు.
బ్యాటింగ్ యూనిట్ కూడా అంత గొప్పగా ఏం లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్ప మిగిలిన యువ ఆటగాళ్లు ఎప్పుడు ఆడుతారో కూడా తెలియదు. ఎవరికీ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం అంతగా లేదు. ఇటీవల కాలంలో టీమిండియా గెలిచిన అన్నీ మ్యాచ్ల్లో కోహ్లీ లేదా రోహిత్ శర్మ రాణిస్తేనే విజయాలు అందుకున్నారు.

ఈ ఇద్దరిపైనే జట్టు పూర్తిగా ఆధారపడి ఉంది. పాకిస్థాన్ మాత్రం భిన్నంగా ఉంది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, షాదబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్ వంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. వీళ్లందరికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఎంతో ఉంది. పాకిస్థాన్ కోర్ టీమ్ చాలా భీకరంగా ఉంది.
టీమిండియాలో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే బ్యాటింగ్ విషయంలో ఎక్కువగా రోహిత్, కోహ్లీపైనే ఆధారపడుతున్నారు. విరాట్, రోహిత్లను త్వరగా అవుట్ చేస్తే.. టీమిండియాని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.

అంతేకాకుండా భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో వాళ్లపై అనవసర ఒత్తిడి నెలకొంది. చాలా ఏళ్లుగా టీమిండియా.. పాకిస్థాన్తో వన్డే మ్యాచ్లు ఆడలేదు. ఐపీఎల్ ఆడిన అనుభవం వన్డేల్లో పనికిరాదు. ఉదయం లేచి, మధ్యాహ్నం తిని, రాత్రి ఐపీఎల్ ఆడుదాం అన్నట్టుగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ఉండదు. పాక్పై గెలవాలంటే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొవాలి. అదే అనుభవంతో మాత్రమే వస్తుంది.'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.