
171 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే
గురువారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ను చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. 86 పరుగుల తేడాతో రాయల్స్ను చిత్తు చేయడంతో 14 పాయింట్లకు చేరడంతో పాటు రన్రేట్ను భారీగా మెరుగుపర్చుకున్న మోర్గాన్ సేన.. ప్లే ఆఫ్స్లో మిగిలి ఉన్న నాలుగో బెర్త్ను కైవసం చేసుకోవడానికి కీలక ముందడుగు వేసింది. మోర్గాన్ టీమ్ +0.587 నెట్ రన్రేట్తో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు ముంబై ఇండియన్స్ ఈరోజు తన చివరి మ్యాచ్లో సన్రైజర్స్తో తలపడనుంది. ఈ మ్యాచులో 171 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే కోల్కతాను వెనక్కినెట్టి ముంబై ముందడుగు వేసే అవకాశం ఉంది. కానీ అది జరగడం అసాధ్యమనే చెప్పాలి. ముంబై -0.048 రన్రేట్తో ఉంది.

టాస్ ఓడితే అంతే సంగతులు
ఒకవేళ సన్రైజర్స్తో జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. మైదానంలోకి దిగకముందే రేసు నుంచి రోహిత్ సేన నిష్క్రమిస్తుంది. దాంతో టాస్కి ముందే ముంబై జట్టులో ఇప్పుడు కంగారు మొదలైంది. ఒకవేళ సన్రైజర్స్ టాస్ గెలిస్తే. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్పకుండా బ్యాటింగ్ ఎంచుకుంటాడు.
ఎందుకంటే.. గత కొన్ని మ్యాచ్లుగా ఛేదనలో నిరాశపరుస్తున్న హైదరాబాద్.. తన పదునైన బౌలింగ్తో తక్కువ లక్ష్యాలని సైతం కాపాడుకోగలదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లోనూ 142 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న హైదరాబాద్.. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏదేమైనా ఈరోజు ముంబై ఫస్ట్ టాస్ గెలవాలి.. ఆ తర్వాత మొదట బ్యాటింగ్ చేసి 250+ పరుగులు చేయాలి. అనంతరం హైదరాబాద్ని 170+ పరుగుల తేడాతో ఓడించాలి.

కొత్త ఛాంపియన్గా అవతరిస్తే బాగుంటుంది
ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్లే ఆఫ్స్ రేసులో ముంబై ఇండియన్స్ లేకపోతే కొత్త ఛాంపియన్లుగా అవతరించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు మంచి అవకాశమని పేర్కొన్నాడు. 'ముంబై ఇండియన్స్ డేంజర్ టీమ్.
ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై తప్పుకోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే.. ముంబై ఒక్కసారి గెలవడం ప్రారంభిస్తే ట్రోఫీ సాధించేవరకూ అసలు ఊరుకోదు. ఈ పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కొత్త ఛాంపియన్గా అవతరిస్తే బాగుంటుంది కదా' అని సల్మాన్ బట్ తన అభిప్రాయం చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆడనున్నాయి.

ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి
ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశ మ్యాచ్లు శుక్రవారం ముగియనుంది. ఈరోజు ఒకే సమయంలో రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. అబుదాబి వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుండగా.. అదే సమయంలో దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొనబోతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే రోజు ఒకే సమయంలో రెండు మ్యాచ్లు జరగడం ఇదే తొలిసారి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో ఈ మ్యాచులు ప్రసారం కానున్నాయి.


Click it and Unblock the Notifications

SRH vs MI Dream11 Prediction: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! పిచ్ రిపోర్ట్, తుది జట్లు ఇవే!!










