వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దవడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఏ మాత్రం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డాడు. దమ్ముంటే ఐసీసీ టోర్నీల్లోనూ పాకిస్థాన్తో మ్యాచ్లను రద్దు చేసుకోవాలని టీమిండియాకు సవాల్ విసిరాడు.
వరల్డ్ ఛాంపియన్స్ లీగ్(డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్తో ఆడేందుకు శిఖర్ ధావన్తో సహా భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఈ మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సహయజమానిగా ఉన్నాడు. జూలై 18న ప్రారంభమైన ఈ టోర్నీ.. ఆగస్ట్ 2న జరిగే ఫైనల్తో ముగియనుంది.

చివరి నిమిషంలో మ్యాచ్ను రద్దు చేయడంపై ఇప్పటికే పాక్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేయగా.. సల్మాన్ బట్ కూడా ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. భారత చర్యను తప్పుబట్టాడు. 'పాకిస్థాన్తో ఆడకూడదని అంత గట్టిగా ఉంటే.. ప్రపంచకప్తో సహా ఏ ఐసీసీ టోర్నీల్లోనూ.. చివరకు ఒలింపిక్స్లోనూ ఆడమని ప్రతిజ్ఞ చేయండి. దమ్ముంటే అలా చేయండి. అప్పుడు మీ జాతీయ ప్రేమ ఏంటో చూస్తాను.
భారత సీనియర్ ఆటగాళ్లు చేసిన పని గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది. అభిమానులకు వారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? పాకిస్థాన్తో మ్యాచ్ ఆడకూడదని సీనియర్ ఆటగాళ్లు ఇతరుపై ప్రభావం తెచ్చారు. ఇది అన్యాయం. ఈ పనిని పాకిస్థాన్ మర్చిపోదు. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల్లో భారత్ తమ వైఖరి మార్చుకుంటే వారి జాతీయ వాదాన్ని గుర్తు చేస్తాం.'అని సల్మాన్ బట్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసగా భారత వెటరన్ ప్లేయర్స్ యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ పాకిస్థాన్తో ఆడేందుకు నిరాకరించారు. శిఖర్ ధావన్ కారణంగానే ఈ మ్యాచ్ రద్దయ్యిందని అఫ్రిది ఆరోపించాడు. అతను ఓ కుళ్లిన కోడిగుడ్డని విమర్శలు గుప్పించాడు.