
కరాచీ: అప్కమింగ్ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ శతకం చేయక దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతని కెరీర్లో సెంచరీకి ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారి. 2019 నవంబర్లో చివరిసారి బంగ్లాదేశ్తో జరిగిన ప్రతిష్టాత్మక పింక్ టెస్టు మ్యాచ్ సందర్భంగా విరాట్ సెంచరీ కొట్టాడు.
దాంతో అంతర్జాతీయ క్రికెట్లో 70వ సారి ఆ ఘనతను అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అప్పటి నుంచీ కోహ్లీ హాఫ్ సెంచరీలు బాదినా వాటిని సెంచరీగా మల్చలేకపోయాడు.
ఈ నేపథ్యంలోనే సల్మాన్ బట్ తాజాగా తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ భారత కెప్టెన్పై ప్రశంసలు కురిపించాడు. 'కోహ్లీ ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుకొట్టాడు. ఈ వయసులో ఒక ఆటగాడు 70 శతకాలు సాధిస్తాడని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు అతడున్నంత ఫిట్నెస్తో ఎవరైనా ఉంటారని అనుకున్నారా? లేదా అతడున్న ఫామ్ గురించి ఆలోచించారా? ప్రస్తుతం కోహ్లీ ఛేదనల్లో 90 స్ట్రైక్రేట్తో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు.
కో శతకం సాధిస్తే ఎవరు అడ్డుకుంటారు? నిజం చెప్పాలంటే అతను ఆడే తర్వాతి మ్యాచ్లోనైనా లేదా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లోనైనా కచ్చితంగా సెంచరీ కొడతాడు. ఏడాదికి పైగా సెంచరీ సాధించకపోయినా అతడు చేసిన పరుగులు చూడండి మీకే అర్థమవుతుంది. కోహ్లీ సెంచరీ కొట్టకపోతే అసలు పరుగులే చేయలేదని మనం అనుకుంటాం. మరో శతకం కొట్టడానికి అవసరమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది కేవలం సమయంతో ముడిపడి ఉంది' అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు.