భారత్తో నెలకొన్న షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. ఇది క్రికెట్కు ఏ మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. 18 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న తాను.. ఇలాంటి ఘటనను ఇప్పటి వరకు చూడలేదని చెప్పాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో విజయానంతరం టీమిండియా ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి డోర్ చేసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే విషయాన్ని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ పరోక్షంగా వెల్లడించాడు. అంతేకాకుండా ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు టీమిండియా అండగా ఉంటుందని, సంఘీభావం కూడా తెలిపాడు. ఐసీసీ, ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నామనే విషయాన్ని తన మాటల ద్వారా స్పష్టం చేశాడు.

అయితే ఈ వ్యవహారంపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావిస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఐసీసీ పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత సూపర్-4 మ్యాచ్లో ఇరు జట్లు మరోసారి తలపడగా.. మళ్లీ భారత్ విజయం సాధించింది. అప్పుడు కూడా పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో పాక్, భారత్ ముచ్చటగా మూడోసారి తలపడనున్నాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన సల్మాన్ అఘాను షేక్ హ్యండ్ వివాదం గురించి ప్రశ్నించగా.. తన జీవితంలోనే ఇలాంటిది చూడలేదని సమాధానమిచ్చాడు.
'నేను 2007 నుంచి క్రికెట్ ఆడుతున్నాను. రెండు జట్లు కరచాలనం చేసుకోకపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి ఘటన ఒకటి జరిగిందని కూడా వినలేదు. గతంలో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పుడున్న దానికంటే దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి. అప్పుడు కూడా ఆటగాళ్లు కరచాలనాలు చేసుకున్నారు. ఇది క్రికెట్కు ఏ మాత్రం మంచిది కాదు.'అని సల్మాన్ అలీ అఘా పేర్కొన్నాడు.
ఫైనల్కు ముందు జరిగే ఇరు జట్ల ఫోటో షూట్కు కూడా టీమిండియా దూరంగా ఉండనుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని పాక్ కెప్టెన్ ముందు ప్రస్తావించగా.. వారు ఏం చేసినా చేయనివ్వండని, తాము మాత్రం ప్రొటోకాల్ను పాటిస్తామని తెలిపాడు. ఫొటో షూట్లో పాల్గొనకపోవడం వారి ఇష్టమని, తాను ఏం చేయలేనని స్పష్టం చేశాడు.