టాస్ ఓడిపోవడం, మిడిలార్డర్ వైఫల్యం తమ సెమీస్ అవకాశాలను దెబ్బతీసిందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. టాస్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. తీవ్ర మంచు ప్రభావం ఉన్న పల్లెకెలె మైదానంలో 160 పరుగులను కూడా డిఫెండ్ చేసుకోలేమని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శ్రీలంకతో జరిగిన తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్లో పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో గట్టెక్కింది.
ఈ మ్యాచ్ గెలిచినా.. పేలవ రన్రేట్ కారణంగా పాకిస్థాన్ సెమీస్కు చేరలేదు. శ్రీలంకను 147 పరుగులకు పరిమితం చేసి 65 పరుగుల తేడాతో విజయం సాధించి ఉంటే పాక్కు సెమీస్ బెర్త్ దక్కేది. కానీ డసన్ షనక, పవన్ రత్నాయకే అద్భుతమైన బ్యాటింగ్తో పాక్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసారు.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సల్మాన్ అఘా.. బ్యాటింగ్లో చివరి రెండు ఓవర్లు దెబ్బతీసాయన్నాడు. బౌలింగ్లో ఉస్మాన్ తారిక్కు కలిసి రాలేదని చెప్పాడు. 'టాస్ ఓడిపోవడం వల్ల మంచు ప్రభావం ఉండటంతో మ్యాచ్ సవాలుగా మారింది. ఒకవేళ మేం టాస్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల మేం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఉస్మాన్కు ఈ రోజు కలిసి రాలేదు. అది ఎవరికైనా జరగొచ్చు. ఈ టోర్నీ అంతటా మేం బ్యాటింగ్లో రాణించలేకపోయాం.

ఫర్హాన్కు సహకారం అందించి ఉంటే ఫలితం బాగుండేది. గత కొన్నేళ్లుగా మా మిడిల్ ఆర్డర్ సమస్యగా మారింది. దానిపై ఫోకస్ పెట్టాలి. మేం అనుకున్న రీతిలో మ్యాచ్ ముగించలేకపోయాం. మేం 18 ఓవర్ల పాటు బాగానే ఆడాం. కానీ చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించింది. ఇక్కడ 160 పరుగులు చేసినా డిఫెండ్ చేయడం కష్టమే.'అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 100), ఫకార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 84) విధ్వసంకర బ్యాటింగ్తో రాణించారు. ఈ ఇద్దరే తొలి వికెట్కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(3/33) మూడు వికెట్లు తీయగా.. డసన్ షనక(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర(1/48) ఒక వికెట్ తీసాడు.
అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. డసన్ షనకతో పాటు పవన్ రత్నాయకే(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్(3/23) మూడు వికెట్లు తీయగా.. షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
